మధ్యాహ్న భోజన పథకంపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలు అంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. దీనిపై విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వీడియోపై గరికపాటి నరసింహారావు టీమ్ స్పందించింది. గరికపాటి వ్యాఖ్యలను వక్రీకరిస్తూ.. దుష్ర్పచారం చేస్తున్నారని పేర్కొంటూ సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి కుతంత్రాలను నమ్మవద్దని.. ఆయన ఎప్పుడూ పేదల పక్షపాతి అని స్పష్టం చేసింది.

రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో గరికపాటి నరసింహారావు మధ్యాహ్న భోజన పథకంపై విమర్శలు చేసినట్లుగా ప్రచారమవుతున్న వీడియోను వక్రీకరించారని ఆయన టీమ్ పేర్కొంది. తెలుగు మహాసభలలో ఆయన అలా మాట్లాడలేదని.. వేరే సందర్భంలో వేరే ఉద్దేశంతో మాట్లాడిన మాటలను కలిపి, వీడియోకు జత చేసి వ్యతిరేక అర్థాలు వచ్చేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని గరికపాటి టీమ్ స్పష్టం చేసింది. ఆయనెప్పుడూ పేదల పక్షమేనని.. ఆయన ప్రసంగాలలో ధనవంతులు, పేదల పట్ల ఔదార్యం చూపించి ఆదుకోవాలని చెప్తుంటారని పేర్కొంది. సంక్షేమ గురుకులాలు, పాఠశాలల్లో పిల్లలకు పౌష్టికాహారం, పాలు, దుప్పట్లు, వస్త్రాలు దానం చేసేందుకు ముందుకు రావాలంటూ దాతలను అనేకసార్లు విజ్ఞప్తి చేశారని గుర్తు చేసింది.
శ్రావణ మాసం నోములలో భాగంగా చీరలను బంధువులకు కాకుండా.. దళితవాడలలో పంచిపెట్టాలని ఎన్నోసార్లు గరికపాటి పిలుపునిచ్చారని ఆయన టీమ్ పేర్కొంది. భగవంతుడు ఎల్లప్పుడూ పేదవాళ్ల పార్టీనే ఎన్నో వేదికలపై చెప్పారని.. ఆయన ప్రసంగాల ప్రభావంతో పేదలు హిందూధర్మ స్ఫూర్తితో ఉన్నారని తెలిపింది. అయితే ఇది చూసి జీర్ణించుకోలేక, గరికపాటిని పేదల నుంచి దూరం చేసేందుకు కొంతమంది మూర్ఖులు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని గరికపాటి టీమ్ ఆరోపించింది. ఇలాంటి కుతంత్రాలకు ఎవ్వరూ కూడా లొంగవద్దని.. హిందువులంతా సమైక్యంగా, సామరస్యంతో జీవించాలనేదే గరికపాటి ఆకాంక్ష అని పేర్కొంటూ గరికపాటి నరసింహరావు టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.


