వంట గ్యాస్ సరఫరాలో ఇబ్బందుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ చేయనుంది. ఏపీకి కేంద్రం 2800 లీటర్ల కిరోసిన్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్కో రేషన్ కార్డుకు లీటర్ చొప్పున ఈ కిరోసిన్ పంపిణీ చేయనున్నారు. రేపటి నుంచి (మార్చి 23) గిరిజన గ్రామాలు, మారుమూల ప్రాంతాలలో కిరోసిన్ పంపిణీ చేయనున్నారు. మరోవైపు ఏపీలో వంట గ్యాస్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి స్పష్టం చేశారు.

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. దీంతో మార్చి 21న విశాఖపట్నం పోర్టుకు చేరాల్సిన నౌక.. మార్చి 26వ తేదీన వస్తోంది. అయితే రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత రాకుండా చూసేందుకు గానూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2800 లీటర్ల కిరోసిన్ కేటాయించింది. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతాలు, మారుమూల పల్లెలలోని రేషన్ కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ చేయనున్నారు.మరోవైపు రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని ఏపీ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. గ్యాస్ నిల్వల గురించి వచ్చే వదంతులు నమ్మవద్దని నాదెండ్ల మనోహర్ కోరారు.
పాఠశాలు, ఆస్పత్రులు, హాస్టళ్లకు వంట గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని మంత్రి స్పష్టం చేశారు. వంట గ్యాస్ సిలిండర్లను ఎవరైనా అక్రమంగా నిల్వ చేసినా.. లేదా అక్రమ రవాణా ద్వారా బ్లాక్ మార్కెటింగ్కు తరలించేందుకు యత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వంట గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లకు వెళ్లకుండా అరికట్టేందుకు సిలిండర్ డెలివరీ సమయంలో ఓటీపీ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. గ్యాస్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని.. అతి త్వరలోనే ఎల్పీజీ గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని నాదెండ్ల మనోహర్ ఆశాభావం వ్యక్తం చేశారు.


