ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో రేపు (మార్చి 23) మరో ముందడుగు పడనుంది. ఏపీలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్గా పరిగణిస్తున్న ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్కు సోమవారం శంకుస్థాపన జరగనుంది. రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలం రాజయ్యపేటలో స్టీల్ ప్లాంట్కు రేపు భూమి పూజ నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు అనకాపల్లి స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు.

మరోవైపు అనకాపల్లి స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని రెండు దశలలో చేపట్టనున్నారు. మొదటి దశలో ఏటా 7.5 మిలియన్ మెట్రిక్ టన్నులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశలో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. నక్కపల్లి స్టీల్ ప్లాంట్కు అనుబంధంగా ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా సంస్థ ఓ కాప్టివ్ పోర్ట్ కూడా ఏర్పాటు చేయనుంది. 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 316 ఎకరాలలో ఈ క్యాప్టివ్ పోర్టు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అదనంగా 11 వేల 198 కోట్లు కేటాయించనున్నారు. దీని ద్వారా మరో ఆరు వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెప్తున్నారు.
అనకాపల్లి స్టీల్ ప్లాంట్ నిర్మాణం ద్వారా విశాఖపట్నం ఎకనమిక్ జోన్.. పారిశ్రామిక కేంద్రంగా మారనుంది. అలాగే దేశీయంగా ఉక్కు అవసరాలు తీరనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తన సహాయ సహకారాలు అందిస్తోంది. అందులో భాగంగా 16వ నంబర్ జాతీయ రహదారిని.. అనకాపల్లి స్టీల్ ప్లాంట్కు కలిపేలా నాలుగు వరుసల రహదారిని అభివృద్ధి చేస్తోంది. అనకాపల్లి స్టీల్ ప్లాంట్ భూమిపూజ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలువురు కీలక నేతలు హాజరు కానున్నారు.
సీఎం చంద్రబాబు, కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస వర్మ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొననున్నారు. ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్, ఏఎంఎన్ఎస్ ఇండియా ఛైర్మన్ ఆదిత్య మిట్టల్ కూడా హాజరు కానున్నట్లు తెలిసింది.సీఎం చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా రాజయ్యపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటల 40 నిమిషాలకు ఎక్స్పీరియన్స్ జోన్ సందర్శిస్తారు. ఏఎంఎన్ఎస్ ఇండియా స్టీల్ ప్లాంట్ మోడల్ పరిశీలిస్చాకుయ అనంతరం కేంద్ర మంత్రులతో కలిసి శంకుస్థాపన ఫలకం ఆవిష్కరిస్తారు.


