
వేసవిలో మన శరీరాన్ని చల్లగా ఉంచడానికి గుండె ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి గుండెపై పడే ఒత్తిడి ప్రమాదకరం. అంతేకాకుండా వేడిలో అధికంగా చెమట పట్టడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ (నిర్జలీకరణం) ఏర్పడి, రక్త పరిమాణం తగ్గి రక్తపోటు పడిపోతుంది. ఇది తల తిరగడం, నీరసం, స్పృహ కోల్పోవడం వంటి వాటికి దారితీస్తుంది. ఇది గుండె రోగులకు ప్రమాదకరం. హృద్రోగ నిపుణుల ప్రకారం వేడి వల్ల రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దీనివల్ల రక్తపోటు తగ్గి గుండె సాధారణ లయకు అంతరాయం కలుగుతుంది.
దీనివల్ల అరిథ్మియా వంటి సమస్యలు తలెత్తవచ్చు. తీవ్రమైన వేడిలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీనివల్ల వడదెబ్బకు గురికావచ్చు. ఈ పరిస్థితి గుండెపోటు లేదా పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు ఈ విషయాలన్నిటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. అధిక వేడి గుండెకే కాకుండా శరీరంలోని అన్ని భాగాలకు కూడా హానికరం. వేసవిలో గుండె జబ్బులను నివారించడానికి వేసవిలో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగినంత నీళ్లు తాగాలి. డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గడం) నివారించడానికి రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. పగటిపూట అత్యంత వేడిగా ఉండే సమయాల్లో అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య బయటకు వెళ్లక పోవడమే బెటర్.
శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి తేలికైన, వదులుగా ఉండే లేత రంగు దుస్తులు ధరించాలి. శరీర ఉష్ణోగ్రతను సౌకర్యవంతంగా ఉంచుకోవడానికి ఫ్యాన్లు, ఎయిర్ కండిషనర్లు ఉపయోగించాలి. గుండె జబ్బుల రోగులు తమ మందులను సరైన సమయంలో తీసుకోవాలి. ఆహారం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తల తిరగడం, వికారం, గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వేసవిలో పెరిగిన ఉష్ణోగ్రత కారణంగా శరీరం అధిక వేడికి గురవుతుంది. దీనివల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే తీవ్రమైన ఆరోగ్య పరిణామాలకు దారితీయవచ్చు. అందువల్ల వడదెబ్బను నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
వేసవిలో తీసుకోవల్సిన జాగ్రత్తలు
- తగినంత నీళ్లు తాగాలి. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవపదార్థాలు తాగడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది.
- మధ్యాహ్నం ఎండలో బయటకు వెళ్లడం మానుకోవాలి. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య సూర్యకిరణాలు తీవ్రంగా ఉంటాయి. వీలైతే ఈ సమయంలో ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నించాలి.
- బయటకు వెళ్లడం తప్పనిసరి అయితే తలపై టోపీ, స్కార్ఫ్ లేదా గొడుగు ఉపయోగించాలి.
- ఆహారంలో తేలికైన, సులభంగా జీర్ణమయ్యే పదార్థాలను తీసుకోవాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలు, సలాడ్లను చేర్చుకోవాలి.
- అధిక శారీరక శ్రమను నివారించాలి. ఎండలో ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల వడదెబ్బ తగిలే అవకాశం పెరుగుతుంది.
- పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వీరికి వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువ.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.

