YV Subba Reddy in Rajahmundry Adulterated milk issue: రాజమండ్రి కల్తీ పాల ఘటన అంశాన్ని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. జీరో అవర్లో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి.. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 16 మంది చనిపోయారని విచారం వ్యక్తం చేశారు. కల్తీ పాల ఘటనలో మృతుల కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఎస్ఏఐ నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు అవసరమని వైవీ సుబ్బారెడ్డి సూచించారు.

మరోవైపు ఏవైనా వస్తువులు కొరత ఉన్నప్పుడే, వాటిని కల్తీ చేయటం చూస్తుంటామన్న వైవీ సుబ్బారెడ్డి.. పాల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పటికీ ఆశ్చర్యంగా పాల కల్తీ విచ్చలవిడిగా జరుగుతోందని అభిప్రాయపడ్డారు. మనిషి ఆరోగ్యానికి పాలు ఎంతో ముఖ్యమైనవని.. ఇలాంటి పాల కల్తీ జరగకుండా చర్యలు తీసుకోవాలని రాజ్యసభలో కోరారు. మరోవైపు రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకూ 16 మంది చనిపోయారు. కిడ్నీలు దెబ్బతిని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు ఫిబ్రవరి 16న రాజమండ్రి కల్తీ పాల ఘటన చోటుచేసుకుంది. ఒక్కరోజు వ్యవధిలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఈ విషయంపై దర్యాప్తు జరపగా.. ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలలో పాలలో ఇథిలీన్ గ్లైకాల్ అనే రసాయనం కలిసినట్లు తేలింది. ఫ్రీజర్లోఇథిలీన్ గ్లైకాల్ లీకై.. పాలలో కలిసినట్లు అధికారులు తెలిపారు. ఈ పాలు తాగిన వారు అనూరియా, అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఇప్పటి వరకూ 16 మంది చనిపోయారు. ఈ కేసులో పాల వ్యాపారి గణేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.


