తెలుగు రాష్ట్రాలలో చికెన్ రేట్లు కొండెక్కాయి. రెండు వారాల కిందటి వరకూ కేజీ రూ.300లోపు ఉన్న చికెన్ ధర.. ఇప్పుడు రూ.350 దాటిపోయింది. కొన్నిచోట్ల రూ.370 వరకూ పలుకుతోంది. అయితే రాబోయే రోజులలో చికెన్ రేట్లు మరింత పెరుగుతాయని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తగ్గిన ఉత్పత్తి, దాణా ఖర్చు వంటి కారణాలతో రాబోయే రోజులలో చికెన్ రేటు పెరిగేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.

డిమాండ్కు అనుగుణంగా కోళ్ల సరఫరా లేకపోవటంతో.. చికెన్ రేట్లు మరింత ప్రియం అయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యాపార వర్గాలు చెప్తున్నారు. ఎండాకాలం కావటంతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కూడా చికెన్ రేట్ల పెరుగుదలకు కారణంగా చెప్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరగటంతో కోళ్ల ఉత్పత్తి తగ్గుతుందని చెప్తున్నారు. చికెన్ వినియోగం పెరగటం, అందుకు అనుగుణంగా సరఫరా తగ్గడం, కోళ్ల దాణా ఖర్చులు పెరగటం, వేడి పరిస్థితులు ఇవన్నీ కలగలిపి మధ్య తరగతి జీవికి ముక్క కొరకకుండా చేస్తున్నాయి. ఈ కారణాలతోనే రెండు వారాల ముందు వరకూ రూ.300లుగా స్కిన్ లెస్ చికెన్ ఇప్పుడు రూ.350 దాటిపోయింది.
మరోవైపు అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉత్పత్తి తగ్గి.. రాబోయే రోజులలో చికెన్ రేటు మరింతగా పెరుగుతుందని పౌల్ట్రీ అసోసియేషన్ సభ్యులు చెప్తున్నారు. ఇక మార్చి ఒకటో తేదీ కిలో 800 వరకూ ఉన్న నాటు కోడి చికెన్ ధర.. ఇప్పుడు కొన్నిచోట్ల రూ.1200 వరకూ పలుకుతోందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
మార్చి నెలలో రంజాన్, ఇతర పండుగలు ఉండటంతో చికెన్ వినియోగం సాధారణంతో పోలిస్తే 20 శాతం పెరిగిందని.. ఇదే సమయంలో సరఫరా 30 శాతం తగ్గిందని చెప్తున్నాయి. ఫలితంగానే చికెన్ రేట్లు పెరుగుతున్నట్లు వెల్లడించాయి. మరోవైపు కోడిగుడ్డు ధరలు ప్రస్తుతం రూ.6గా ఉన్నాయి. ఇక నాటు కోడి గుడ్డు ధర రూ.15 నుంచి రూ.20 వరకూ పలుగుతోంది. కోడిగుడ్ల ఎగుమతులు తగ్గటంతో రేట్లు కొంచెం తగ్గినట్లు వ్యాపార వర్గాలు చెప్తున్నాయి.


