
కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా వీధి వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, గృహ సహయకుల కోసం ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ పథకాన్ని మోదీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది. వీరికి నెలకు రూ.3 వేల పెన్షన్ అందిస్తోంది. రిటైర్మెంట్ తర్వాత ప్రతీ నెలా ఈ పెన్షన్ అందుతుంది. ఈ పథకంలో చేరాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలి.. అంతేకాకుండా కొంతమొత్తంలో ప్రీమియం చెల్లించాలి.. ఈ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
అర్హతలు ఇవే..
-18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి
-నెలవారీ ఆదాయం రూ.15 వేల కంటే తక్కువగా ఉండాలి
-ఈపీఎఫ్, ఎన్పీఎస్ వంటి సౌకర్యాలు ఉండకూడదు
ప్రీమియం ఎంత..?
వయస్సు, మీరు రిటైర్మెంట్ తర్వాత ఎంతవరకు పెన్షన్ పొందాలని అనుకుంటున్నారు అనే దానిని బట్టి ప్రీమియం ఉంటుంది. కానీ ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. మీరు 18 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ.55 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ప్రభుత్వం కూడా అందుకు సమానంగా రూ.55 చెల్లిస్తుంది. వయస్సు పెరిగే కొద్ది ఇందులో చేరితే ప్రీమియం ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక 60 ఏళ్లు వచ్చేంతవరకు అదే ప్రీమియం చెలించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల దాటాక మీకు ప్రతీ నెలా రూ.3 వేల పెన్షన్ అందిస్తారు. ఒకవేళ పెన్షన్దారుడు మరణిస్తే.. జీవిత భాగస్వామికి 50 శాతం పెన్షన్ అందుతుంది. అంటే ప్రతీ నెలా రూ.1500 ఇస్తారు.
దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
ఈ పథకంలో చేరడం చాలా సులువు. ఆన్ లైన్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా సమీపంలోని కామన్ సర్వీసెస్ సెంటర్కు వెళ్లి అప్లై చేసుకోవచ్చు. కేవలం ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ సమర్పిస్తే సరిపోతుంది. ఇక మీరే స్వయంగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కేంద్ర ప్రభుత్వ మాన్ ధన్ పోర్టల్లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఇప్పటివరకు దాదాపు 52.5 లక్షల మంది ఈ స్కీమ్లో చేరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్నేు కాకుండా కుటుంబానికి ఆర్ధిక భరోసా కూడా దీని ద్వారా కల్పింవచ్చు.

