Andhra Pradesh
oi-Sai Chaitanya
అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతి శాశ్వత రాజధాని గా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ ఏపీ కేబినెట్ తీర్మానం చేసింది. ఈ నెల 28న ప్రత్యేకంగా భేటీ కానున్న అసెంబ్లీ ఇదే అంశం పైన తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ ప్రతిపాదన ఆమోదం పొంది.. అమరావతి ఏపీ శాశ్వత రాజధానిగా రాజ ముద్ర పడనుంది. ఈ సమయంలో అమరావతి పై వైసీపీ సంచలన ప్రకటన చేసింది.
అమరావతి ఏపీ శాశ్వత రాజధానిగా కేంద్రం అధికారిక రాజముద్ర వేసేందుకు తుది కసరత్తు జరుగుతోంది. ఇందు కోసం ఈ రోజు కేబినెట్ లో తీర్మానం ఆమోదించగా.. ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. ఈ సమయంలో వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి పై పార్టీ విధానం ప్రకటించారు. అమరావతి పై తీర్మానం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఎవరు అభ్యంతరం చెప్పారు.. ఎవరు అడ్డంకులు చెప్పారని ప్రశ్నించారు. అమరావతికోసం అసెంబ్లీలో తీర్మానం అన్నది చంద్రబాబు డ్రామాగా పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్న ఎత్తుగడగా సజ్జల అభివర్ణించారు. అమరావతి పేరిట అవినీతి నుంచి, రైతులకు పరిష్కారం కాని అంశాలనుంచి పక్కదోవ పట్టించే ప్రయత్నంగా ఆరోపించారు. అసెంబ్లీతో పాటు, మండలిని కూడా సమావేశపర చాలి కదా అని సజ్జల ప్రశ్నించారు. అమరావతి లో చంద్రబాబు అవినీతి, వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తారనే మండలిని పిలవటం లేదా అని సందేహం వ్యక్తం చేసారు.

అమరావతికి వ్యతిరేకం కాదు
రాష్ట్రానికి శాశ్వత రాజధానిని నిర్మించి, ప్రజలకు వేగంగా అందుబాటు లో కి తీసుకురావాలన్న ఆలోచన చంద్రబాబు ఎప్పుడూ చేయలేదని విమర్శించారు. అలా కాకుం డా రాజధాని అంశాన్ని శాశ్వత కామధేనువుగా మార్చారని ఆరోపించారు. రాజధాని విషయంలో చంద్రబాబుకు ఆచరాణాత్మక ధోరణి ఇప్పటికీ లేదని ధ్వజమెత్తారు. వైయస్సార్సీపీ అభివృద్ధి వికేంద్రీకరణలో అమరావతికీ స్థానం ఉందని, అయితే ఇదంతా గతంలో జరిగిన పరిణామాలుగా పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు, వచ్చాక కూడా ఏమీ చేయడం లేదని విమర్శించారు. చంద్రబాబు ఊహాజనిత రాజధాని, దానికయ్యే ఖర్చు ఎంత అవుతుంది అన్నదానిపై తాము ప్రశ్నలు వేశామని చెప్పారు. అంతే తప్ప అమరావతి ప్రాంతానికి ఎప్పుడూ జగన్ వ్యతిరేకం కాదని సజ్జల ప్రకటించారు. అందుకనే 2019లో అధికారంలోకి రాకముందే జగన్ ఇక్కడ ఇల్లు కట్టుకున్నారని చెప్పుకొచ్చారు. అమరావతి ప్రాంతానికి వైయస్సార్సీపీ ఆరోజూకాని, ఈఆరోజుకాని ఎప్పుడూ అభ్యంతరం లేదని స్పష్టం చేసారు. తమ అభ్యంతరం అవినీతి మీద, దోపిడీ మీదే అని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసారు.

