Telangana
oi-Dr Veena Srinivas
ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు, శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు ఆ పనిని సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తే ప్రజా జీవితం ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. అలాకాకుండా రక్షించాల్సిన పోలీసులే, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే, శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రవర్తిస్తే, అటువంటి పోలీసులు సమాజానికి హానికరంగా మారతారని చెప్పవచ్చు.
మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఎస్సై సస్పెన్షన్
ఈ క్రమంలోనే అలా సమాజానికి చెడు చేసే పోలీసులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్ ఎంతటి వాడైనా సరే కచ్చితంగా అందుకు తగిన శిక్ష అనుభవిస్తాడని పోలీస్ వ్యవస్థ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న ఎం సురేష్ పైన సస్పెన్షన్ వేటు పడింది.

అధికారుల విచారణలో ఆరోపణలు రుజువు
వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఎస్. ఐగా విధులు నిర్వహిస్తున్న యం సురేష్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ నేడు ఉత్తర్వులు జారీచేశారు..ఎస్. ఐ అవినీతికి పాల్పడుతున్నాడని, వచ్చిన ఆరోపణలు అధికారుల విచారణలో రుజువు కావడంతో ఎస్. ఐ ను సస్పెండ్ చేశారు. గత కొంతకాలంగా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
అధికార పార్టీ నేతలకు వత్తాసుగా కేసుల తప్పుదారి
గొడవలు, కేసుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, కొన్ని కేసులలో అధికార పార్టీ నేతలకు మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు రాగా, విచారణ జరిపిన ఉన్నతాధికారులు అవి నిజమని తేలడంతో ఎస్సై ను సస్పెండ్ చేశారు.గతంలో కూడా మిల్స్ కాలనీ పరిధిలో పనిచేసిన పోలీసులు అనేక వివాదాలలో చిక్కుకున్నారు.
గతంలోనూ మిల్స్ కాలనీ పీఎస్ పోలీసులపై ఆరోపణలు, కేసులు
మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో పనిచేసిన ఎస్ఐ శ్రీకాంత్ అర్ధరాత్రి స్థానికంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న దళిత మహిళ పైన దాడి చేసిన ఘటన నేపథ్యంలో ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. ఇక తాజాగా అదే మిల్క్ కాలనీ పోలీస్ స్టేషన్ లో పని చేసిన ఎస్ఐ ఎం సురేష్ పై వచ్చిన ఆరోపణలతో, దర్యాప్తు చేసి, ఆరోపణలు నిజమని తేలడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ ఆయనను సస్పెండ్ చేశారు. దీంతో వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో పోలీసుల తీరుపైన చర్చ జరుగుతుంది.

