ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం కారణంగా వంట గ్యాస్, ఇంధన కొరత భయాలు నెలకున్నాయి. హర్మూజ్ జల సంధి నుంచి వచ్చే నౌకలను ఇరాన్ అడ్డుకోవడంతో సరఫరా గొలుసుకు అంతరాయం ఏర్పడింది. ఈ ఆందోళనల నడుమ భారీ నౌకలు విశాఖపట్నం తీరానికి శుక్రవారం చేరుకున్నాయి. ఎల్పీజీ సరఫరాలో ఇబ్బందుల వేళ బిర్చ్ అనే నౌక విశాఖపట్నం పోర్టుకు చేరుకోవడం, ఆయిల్ ట్యాంకర్ కూడా రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెలాఖరుకి మరో రెండు నౌకలు రాబోతున్నాయి.

ఇంధన సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతాయేమోనని అధికార యంత్రాంగం ఆందోళన చెందుతుండగా.. భారీ నిల్వలతో ఈ రెండు నౌకలు ఒకేసారి రావడంతో కాస్తా ఊపిరి పీల్చుకున్నారు. మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా అవసరమైన చర్యలు తీసుకునే వీలుంటుందని అధికారులు తెలిపారు. ఈ పరిణామం కేవలం విశాఖకే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల సప్లయ్ ఛైన్ను బలోపేతం చేయనుంది. పారిశ్రామిక అవసరాలకు సైతం ఇది ఉపయోగపడనుంది. అయితే, గ్యాస్ కొరత వస్తుందేమోననే భయాందోళనతో జనం ముందస్తు స్టాక్ పెట్టుకుంటున్నాయి. అయితే, ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.
మరోవైపు, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ప్రభావం క్రమేపీ అన్నివర్గాలపై పడుతోంది. హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, తోపుడు బళ్లపై టిఫిన్, టీ విక్రయించే చిరు వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. గృహవినియోగదారులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రభుత్వం సూచనలతో గ్యాస్ ఏజెన్సీలు వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేశాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. కట్టెల పొయ్యిపై వంట చేయాల్సి వస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లలో మెనూలను తగ్గించేయగా.. కొన్ని హోటళ్లు మూతపడ్డాయి.


