
ఆధార్ కార్డు అనేది దేశంలో నివసించే ప్రతీవ్యక్తికి అవవసమైన ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది లేనేది ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేట్ సర్వీసులు పొందలేరు. ప్రభుత్వ పథకాలు పొందటం దగ్గర నుంచి సిమ్ కార్డు పొందటం వరకు ప్రతీ పనికి ఈ కార్డు అవసరమే. ఎప్పుడు అవసరం పడుతుందో తెలియకపోవడం వల్ల ఆధార్ ఎప్పుడూ మన వెంటే ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇటీవల యూఐడీఏఐ అనేక కొత్త రూల్స్ను తీసుకొస్తుంది. కార్డుదారులకు ఉపయోగపడేలా, సులభతరంగా సేవలు పొందేలా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా యూఐడీఏఐ మరో ఊరట కలిగించే ప్రకటన చేసింది. అదేంటంటే..
ఏదైనా చెల్లుబాటు అవుతుంది
ఆధార్ కార్డును ఫోన్లో చూపించడం, ఈ-ఆధార్, ఆధార్ లెటర్, ఆధార్ పీవీసీ కార్డ్, ఆధార్ వెబ్ సైట్ లేదా యాప్లో డిజిటల్ కార్డులన్నీ చెల్లుబాటు అవుతాయని యూఐడీఏఐ స్పష్టం చేసింది. కొంతమంది ఇవి చెల్లవని, కేవలం ఫిజికల్ కాపీ మాత్రమే చెల్లుబాటు అవుతుందని చెబుతున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై యూఐడీఏఐకు ఫిర్యాదులు అందటంతో.. ప్రజలకు భారీ ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఫిజికల్ ఆధార్ లేని సమయంలో ఈ-ఆధార్, యాప్ల్లో డిజిటల్ ఆధార్, పీవీసీ కార్డు వంటివన్నీ చెల్లుతాయని, ధృవీకరణ కోసం వాటిని ఉపయోగించవచ్చని తెలిపింది. ప్రజలు సులభతరంగా ఆధార్ను ఉపయోగించుకునేలా చేయడంలో భాగంగా ఈ ప్రకటన జారీ చేసింది. ఇటీవల డిజిటల్గా ఆధార్ సేవలు అందించేందుకు యూఐడీఏఐ అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. జనవరిలో ఆధార్ యాప్ను కొత్తగా లాంచ్ చేసింది. దీని వల్ల ఆధార్ డిజిటల్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడైనా ధృవీకరణ కోసం ఆధార్ అవసరమైనప్పుడు ఫిజికల్ కాపీ అందించాల్సిన అవసరం ఉండదు. ఈ యాప్ ద్వారానే డిజిటల్ కాపీని చూపించి వెరిఫికేషన్ చేసుకోవచ్చు.
కొత్త సేవలు
ఇక ఆధార్ యాప్లో అనేక కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. మొబైల్ నెంబర్, అడ్రస్ లాంటివి సులువుగా అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇప్పటివరకు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలంటే ఆధార్ సెంటర్కు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి మొబైల్ యాప్ ద్వారా సెకన్లలోనే చేసుకోవచ్చు. ఇక అడ్రస్ అప్డేట్ చేసుకోవాలన్నా పని సలువుగా మారింది. గతంలో తరహాలో ప్రతీ పనికి ఆధార్ సెంటర్కు వెళ్లి క్యూలో నిల్చోవాల్సిన పని ఉండదు. ఆధార్ పేరుతో వచ్చిన ఈ యాప్లోనే అన్నీ సేవలు పొందవచ్చు. ఈ యాప్కు డౌన్ లోడ్స్ కూడా పెరుగుతున్నాయి.

