Andhra Pradesh
oi-Lingareddy Gajjala
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్తో దూసుకుపోతున్న జనసేన పార్టీకి ఇప్పుడు సొంత ఎమ్మెల్యేల వ్యవహారాలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. కూటమి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా దూసుకుపోతుంటే.. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి చుట్టూ మాత్రం ఎన్నికల అక్రమాల వివాదం ముదిరింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి ఆమె 39,829 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించినప్పటికీ, ఇప్పుడు ఆ గెలుపు వెనుక ఆర్థిక అక్రమాలు ఉన్నాయన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
లోకం మాధవికి చెందిన ‘మిరాకిల్ సాఫ్ట్వేర్’ సంస్థ ద్వారా ఎన్నికల సమయంలో భారీగా నగదు మళ్లింపు జరిగిందని కేంద్ర ఎన్నికల కమిషన్ (ECI)కు ఫిర్యాదు అందింది. ఆ సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగి ఆనంద్ అన్ని ఆధారాలతో ఈసీని ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు సుమారు 300 మంది ఉద్యోగుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి అక్రమంగా నగదు జమ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

జీతంతో పాటు అదనంగా లక్షలు!
ఉద్యోగులకు ఇచ్చే రెగ్యులర్ జీతంతో సంబంధం లేకుండా, ఒక్కో ఉద్యోగి ఖాతాలో అదనంగా రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు జమ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిధులను ఎన్నికల ఖర్చు కోసం లేదా ఓటర్లను ప్రలోభపెట్టడానికి మళ్లించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల కమిషన్, దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది. ఒకవేళ ఈ అక్రమాలు నిరూపితమైతే ఆమె పదవికే ముప్పు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్కు పెరిగిన తలనొప్పులు..
జనసేన పార్టీకి ఉన్నది కేవలం 21 మంది ఎమ్మెల్యేలు. కానీ, రోజుకో వివాదం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తోంది. మొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వ్యవహారం, నిన్న అరవ శ్రీధర్ వివాదం, నేడు లోకం మాధవిపై ఈసీ విచారణ.. ఇలా వరుస ఘటనలతో జనసేనాని పవన్ కళ్యాణ్కు కొత్త సంకటాలు ఎదురవుతున్నాయి. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాలని పవన్ పదే పదే చెబుతున్నా, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల తీరు పార్టీని డిఫెన్స్లో పడేస్తోంది. ఈ తాజా పరిణామాలపై లోకం మాధవి ఎలా స్పందిస్తారో, పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

