“వైద్యో నారాయణో హరి” అంటూ వైద్యులను దైవంతో సమానంగా కొలిచే దేశం మనది. కోవిడ్-19 మహమ్మారి విరుచుకుపడి ప్రాణాలు బలితీసుకుంటున్న సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్యులు అందించిన సేవలు ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. తల్లి జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. ప్రజల ప్రాణాలు కాపాడే మహోన్నత వృత్తిలో ఉన్న వైద్యుల ప్రాణాలకే రక్షణ లేని పరిస్థితులు దేశంలో ఆందోళన కల్గిస్తున్నాయి. కోల్కత్తాలో 31 ఏళ్ల సీనియర్ రెసిడెంట్ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్య ఘటన యావత్ ప్రపంచాన్నే ‘షాక్’కి గురిచేసింది. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగానూ వైద్యలోకం గళమెత్తింది. ఈ క్రమంలోనే వైద్యరంగంలో పద్మ అవార్డులు అందుకున్న పలువురు ప్రఖ్యాత వైద్యులు ప్రధానమంత్రికి లేఖ రాశారు. హెల్త్కేర్ నిపుణులు, సిబ్బంది రక్షణ కోసం చట్టం తీసుకురావాలని కోరారు. మహిళలు, బాలికలు, హెల్త్కేర్ నిపుణులపై జరుగుతున్న హింస, లైంగిక దాడులను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. కోల్కత్తా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో హత్యాచారానికి గురైన సీనియర్ రెసిడెంట్ డాక్టర్ కుటుంబానికి సానుభూతి, సంఘీభావం ప్రకటించారు. అలాగే ఆందోళన బాట పట్టిన వైద్యలోకానికి బాసటగా నిలుస్తున్నామని వెల్లడించారు. ఈ క్రమంలో 5 ప్రధాన డిమాండ్లను ప్రధాన మంత్రి ముందు పెట్టారు.
01. ప్రస్తుత చట్టాలను కఠినంగా అమలు చేయాలి: దేశవ్యాప్తంగా వైద్యులపై దాడుల ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేస్తూ వారికి రక్షణ కల్పించాలి.
02. లైంగిక నేరాలకు పాల్పడేవారిని నిర్ణీత కాలవ్యవధిలో కఠినంగా శిక్షించాలి: వైద్యులపై లైంగిక వేధింపులు, దాడులు, అత్యాచారం వంటి నేరాలకు పాల్పడేవారిపై వేగంగా చర్యలు చేపట్టాలి. నిర్ణీత కాలవ్యవధిలోగా వారికి కఠిన శిక్ష పడేలా చూడాలి.
03. ఆస్పత్రుల్లో, వైద్య రంగ సంస్థల్లో మెరుగైన భద్రత: దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రులు, వైద్యారోగ్య సంస్థల్లో పనిచేసే సిబ్బందికి మరింత మెరుగైన భద్రత కల్పించాలి. ఆ మేరకు సేఫ్టీ ప్రొటోకాల్స్ రూపొందించడం లేదా మరింత మెరుగుపర్చడం చేయాలి. ఈ తరహా నేరాలు జరగకుండా నిరోధించాలి
04. ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి: వైద్యులు, ఇతర హెల్త్కేర్ నిపుణులు, సిబ్బంది రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. వైద్యరంగ సిబ్బంది రక్షణ కోసం “ది ప్రివెన్షన్ ఆఫ్ వయోలెన్స్ ఎగెనెస్ట్ డాక్టర్స్, మెడికల్ ప్రొఫెషనల్స్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ బిల్” పేరుతో ప్రతిపాదించిన బిల్లు 2019 నుంచి సిద్ధంగా ఉంది. కానీ దాన్ని ఇంత వరకు పార్లమెంటులో ప్రవేశపెట్టలేదు. ఈ బిల్లును తక్షణమే ఆర్డినెన్సు రూపంలో అమల్లోకి తీసుకొచ్చి, తదుపరి జరిగే పార్లమెంటు సమావేశాల్లో చట్ట రూపం తీసుకురావాలి. అప్పుడే హెల్త్కేర్ రంగంలో పనిచేసేవారు నిర్భయంగా పనిచేయగల్గుతారు.
05. వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడేవారికి కఠిన శిక్షలు: ప్రతిపాదిత బిల్లు లేదా ఆర్డినెన్సులో హెల్త్కేర్ సిబ్బందిపై దాడులకు, లైంగిక నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేలా నిబంధనలు రూపొందించాలి. ఆ నేరాలను నాన్-బెయిలబుల్ నేరాలుగా పరిగణించాలి.
ఈ ఐదు ప్రధాన డిమాండ్లను ప్రధాని ముందుంచిన పద్మ అవార్డు గ్రహీతలైన వైద్యులు కొత్త చట్టం తీసుకురావడంతోనే సరిపెట్టకుండా కఠినంగా అమలు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కొన్నాళ్ల తర్వాత మర్చిపోవడం పరిపాటిగా మారిపోయిందని అసహనం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను పొందిన వైద్యులుగా తాము చేస్తున్న విజ్ఞప్తి ఇదొక్కటే అని నొక్కి చెప్పారు. ఈ విషాదం నిజమైన, శాశ్వతమైన మార్పునకు ఉత్ప్రేరకంగా మారాలని, నిర్భయ సహా లైంగిక హింసకు గురైన వారందరినీ స్మరిస్తూ అటువంటి భయానక సంఘటనలు కనీసం ఊహించడానికి కూడా వీల్లేని సమాజాన్ని సృష్టించాలని ఆశించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..