ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు త్వరలో జోరందుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పనులకు పునఃప్రారంభం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే త్వరలోనే ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు రానున్నారు. ఈ వివరాలను సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం వెల్లడించారు. ఏపీ కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో చంద్రబాబు ఈ వివరాలను పంచుకున్నారు.

మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు రానున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. మే రెండో తేదీ మోదీ అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని మంత్రులతో చర్చ సందర్భంగా వెల్లడించారు. ఇదే సమయంలో మూడేళ్లలోగా అమరావతిలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు, రహదారులు పూర్తి చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు ఏపీ కేబినెట్ భేటీలో అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణాలను ఎల్1 బిడ్డర్కు అప్పగించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.
మంత్రులకు చంద్రబాబు క్లాస్!
ఇక ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశంలో ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. టీటీడీ గోశాల వివాదం, వక్ఫ్ చట్టం, పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి అంశాలు కేబినెట్ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా మంత్రులకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. ప్రతిపక్షం ప్రజలను రెచ్చగొట్టే ప్రచారం చేసిందన్న చంద్రబాబు నాయుడు.. టీటీడీ గోశాల సహా మతపరమైన అంశాలలో వైసీపీ ఆరోపణలను మంత్రులు ధీటుగా తిప్పికొట్టలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలాంటి అంశాలపై మంత్రులు వెంటనే స్పందించాలని సూచించినట్లు సమాచారం.
చంద్రబాబు విదేశీ పర్యటన
మరోవైపు ఏప్రిల్ 17 నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఏప్రిల్ 20వ తేదీన చంద్రబాబు 75వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులతో కలిసి ఐదురోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం.