అమరావతి, ఏప్రిల్ 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1136 ఎస్జీటీ, 1124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. త్వరలో విడుదల చేయనున్న డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్పెషల్ ఎడ్యుకేషన్ కింద మంజూరైన ఈ పోస్టులను ఆటిజం సహా మానసిక వైకల్యం కలిగిన విద్యార్ధులకు విద్యను బోధించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిందిగా పేర్కొంటూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది.
స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో మొత్తం 1984 పోస్టులు ఉండగా అందులో 860 పోస్టులకు అనుమతి ఉంది. మిగిలిన 1124 పోస్టులను కొత్తగా మంజూరు చేశారు. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను గరిష్టంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు 151, కనిష్టంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు 44 మంజూరు చేశారు. ఇప్పటి వరకు ప్రాథమిక పాఠశాలల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు అందుబాటులో లేరు. తాజాగా 1136 ఎస్జీటీ పోస్టులను స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగానికి మంజూరు చేయడంతో ప్రత్యేక అవసరాల గల పిల్లల బోధనకు అవకాశం కల్పించినట్లైంది.
కాగా రాష్ట్రంలో మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కూటమి సర్కార్ ఎస్సీ వర్గీకరణపై కసరత్తుచేస్తుంది. ఈ ప్రక్రియ ముగియగానే మెగా డీఎస్సీ పరీక్ష నిర్వహించి, ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.