అమెరికా – చైనా మధ్య ట్రేడ్ వార్ పీక్స్కి వెళ్తోంది. టారిఫ్లలో ఇరు దేశాలు తగ్గబోమని తేల్చేస్తూ.. ఉద్రిక్త పరిస్థితులను అంతకంతకు పెంచుతున్నాయి. ఈ క్రమంలో చైనా కీలక ఖనిజాల ఎగుమతిని నిలిపివేసింది. వెపన్స్, ఎలక్ట్రానిక్స్, కార్లు, విమానాలు, సెమీ కండక్టర్ల తయారీలో కీలకమైన ఖనిజాల ఎగుమతులను నిలిపివేసింది. చైనా కొత్త ఎగుమతి విధానాన్ని రూపొందిస్తుండటంతో అమెరికా ఇబ్బందికర పరిస్థితుల్లో పడటం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా – చైనా మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకి ముదురుతోంది. ఈసారి చైనా ఓ కొత్త ఆయుధాన్ని బయటకు తీసింది. అదే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఈ ఖనిజాలు లేకుంటే ఆధునిక ప్రపంచ స్తంభించిపోతుంది. కార్ల తయారీ నుంచి క్షిపణుల వరకు.. స్మార్ట్ ఫోన్ల నుంచి విమానాల వరకు.. ప్రతిదీ ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్తోనే తయారవుతాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా వస్తువులపై ప్రతీకార పన్నులు పెంచడంతో డ్రాగన్ కంట్రీకి కోపం వచ్చింది. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతి నిలిపివేసింది. దీంతో అమెరికాలో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఆయుధ పరిశ్రమలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.
ప్రపంచంలో 90-శాతం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చైనాలోనే ఉత్పత్తి అవుతున్నాయి. అమెరికాలో ఒక్క గని మాత్రమే ఉంది. దీంతో అగ్రరాజ్యం పూర్తిగా చైనాపైనే ఆధారపడాల్సి వస్తోంది. శాశ్వత అయస్కాంతాలుు, ఇతర ఉత్పత్తుల ఎగుమతిని కూడా చైనా నిలిపివేయడంతో వీటిని భర్తీ చేయడం అమెరికాకు కష్టమే. ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది.
కేవలం అమెరికాకు మాత్రమే కాకుండా మిగతా దేశాలకు కూడా చైనా ఎగుమతులు నిలిపివేసింది. ఖనిజాల తవ్వకం.. ప్రాసెసింగ్పై తన ఆధిపత్యాన్ని చూపించేందుకు చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్టు క్లియర్గా కనిపిస్తోంది. అమెరికా కొన్ని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ నిల్వ చేసినప్పటికీ.. అది సైనిక కాంట్రాక్టర్లకు శాశ్వతంగా సరఫరా చేయడానికి ఏమాత్రం సరిపోదు. హెవీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్పై ఆంక్షలు చాలా కీలకంగా మారాయి. అయస్కాంతాలు ఎలక్ట్రిక్ కార్లు, డ్రోన్లు, రోబోట్లు, క్షిపణులు, అంతరిక్ష నౌకలు, గ్యాసోలిన్-శక్తితో నడిచే కార్ల తయారీకి అవసరం. ఇవి జెట్ ఇంజన్లు, లేజర్లు, కార్ హెడ్లైట్లు, కొన్ని స్పార్క్ ప్లగ్లు, కెపాసిటర్ల తయారీకి అవసరం. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వర్లు, స్మార్ట్ఫోన్లకు శక్తినిచ్చే కంప్యూటర్ చిప్లలోని విద్యుత్ భాగాలు. చైనా ఈ చర్యతో అమెరికాకు పెద్ద షాక్ ఇచ్చింది. అమెరికా ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి..!
చైనా ఆంక్షలతో అమెరికా ఏం చేయబోతుందన్నది కీలకంగా మారింది. ఫైటర్ జెట్స్ మిస్సైల్స్లో వాడే అరుదైనా N d f e B .. నియోడిమియం-ఐరన్- బోరాన్ పై అమెరికా సహా చాలా దేశాలు చైనాపై ఆధారపడ్డాయి. భద్రతా కారణాల దృష్ట్యా చైనాపై ఆధారపడటం తగ్గించాలని జో బైడెన్ హయాంలోనే అమెరికా నిర్ణయించింది. అమెరికాలోనే ఆ మెటల్ ను ఉత్పత్తి చేయాలని సంకల్పించింది. చాలా సంస్థలు చైనాపై ఆధారపడిన క్రమంలో ఆ వినియోగాన్ని తగ్గించేందుకు దిగుమతిపై టారిఫ్ పెంచాలని అప్పట్లోనే నిర్ణయించారు. చైనాపై ఆధారపడ్డం తగ్గిపోయి.. సొంతంగా ఉత్పత్తి చేసుకునే సామర్ధ్యం పెరుగుతుందన్నది అమెరికా ఆలోచనగా కనిపిస్తోంది.
సుంకాల సెగతో హీట్ పుట్టిస్తున్న ట్రంప్ నిర్ణయాలు పారిశ్రామిక ప్రగతిని అడ్డుకుంటుందనే చర్చ జరుగుతోంది. టారిఫ్ల పెంపుతో చైనా నుంచి దిగుమతి చేసుకునే మెటల్ కాస్ట్ పెరుగుతుందని.. దీంతో వినియోగదారులపై అధిక భారం పడుతుందని ఇప్పటికే కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పుడు ఏకంగా చైనా ఎగుమతులే నిలిపివేయడంతో అమెరికా ఏం చేయబోతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా కనిపిస్తోంది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటారా..? ఢీ అంటే ఢీ అంటూ వాణిజ్య యుద్ధాన్ని కంటిన్యూ చేస్తారా చూడాలి..!
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..