N. Chandrababu Naidu
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు 75వ పుట్టిన రోజు వేడుకల సంబరాలను అంబరాన్నంటించారు తెలుగు తమ్ముళ్లు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లోని చంద్రబాబు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు వేడుకలు చేసుకున్నారు. విదేశాల్లో కుటుంబసభ్యుల మధ్య సీఎం చంద్రబాబు కేక్ కట్ చేశారు. పార్టీ జాతీయ కార్యాలయంలోనూ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని మోదీ. చంద్రబాబు తనకు మంచి స్నేహితుడన్నారు. భవిష్యత్ రంగాలపై దృష్టి సారించి ఏపీ అభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషి ప్రశంసనీయమంటూ ఎక్స్లో మోదీ ట్వీట్ చేశారు.
రాష్ట్ర ప్రగతి పునర్జీవింప చేయడం చంద్రబాబుకే సాధ్యమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్. పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలంటూ.. విషెశ్ చెప్పారు. చంద్రబాబు వ్యవస్థలను నడిపే విధానం స్ఫూర్తిదాయకమన్నారు పవన్. చంద్రబాబు అంటేనే లెజెండ్. తనకు స్ఫూర్తిదాయకం కూడా ఆయనే అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు మంత్రి లోకేష్.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు జగన్.
తెలుగు ప్రజల ప్రగతికి మార్గనిర్దేశకుడిగా, ఆధునిక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శిల్పిగా, రాజకీయాల్లో నైతికతకు ప్రతీకగా నిలిచిన చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు ఎమ్మెల్యే బాలయ్య. ఎన్నో విప్లవాత్మక మార్పులను చూచించి.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చేస్తున్న దీక్ష ప్రతి తరానికీ ప్రేరణగా నిలుస్తుందన్నారు.
చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాల పుస్తకావిష్కరణ కూడా జరిగింది. చంద్రబాబు నిత్య విద్యార్థని అన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.
నారా అంటే రాజకీయ డిక్షనరీ. చంద్రబాబు నిరంతరం ప్రజల కోసమే ఆలోచిస్తారంటూ కొనియాడారు టీడీపీ నేతలు.
విజయవాడలో చంద్రబాబు భారీ కటౌట్కు పూలాభిషేకం నిర్వహించి.. టీడీపీ నేతలు కేక్ కట్ చేశారు. దేశంలో ఎంతమంది నాయకులున్నా చంద్రబాబే లెజెండ్ అన్నారు బుద్ధా వెంకన్న. సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను తిరుమలలో ఘనంగా నిర్వహించారు టీడీపీ నేతలు. అఖిలాండం దగ్గర టీడీపీ నేత శ్రీధర్ వర్మ 750 కొబ్బరి కాయలు కొట్టారు. ఏడున్నర కిలోల కర్పూరం వెలిగించి పూజలు చేశారు.
చంద్రబాబు లాంటి నాయకుడు లభించడం తెలుగువారి అదృష్టమన్నారు మెగాస్టార్ చిరంజీవి. కృషి, పట్టుదల, అంకిత భావం ఉన్న గొప్ప నాయకులు చంద్రబాబు. ఆయన కనే కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ చిరంజీవి ఎక్స్లో పోస్ట్ చేశారు. మోహన్బాబు, రాఘవేంద్రరావు, సోనూసూద్, నాగవంశీ, గోపీచంద్ మలినేని సహా అనేక మంది సినీ ప్రముఖులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
విజన్ 2047 థీమ్తో విశాఖ సాగరతీరంలో రూపొందించిన సీఎం చంద్రబాబు సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటుంది. V.M.R.D.A చైర్ పర్సన్ ప్రణవ గోపాల్ ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. నరసింహం అనే కళాకారుడు ఈ సైకత శిల్పాన్ని అందంగా తీర్చిదిద్దారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి