బాహుబలి షూటింగ్ టైమ్లోనే తాను మహాభారతాన్ని కూడా భారీగా తెరకెక్కిస్తానని చెప్పారు రాజమౌళి. కానీ ఆ కథను తెరకెక్కించడానికి తన అనుభవం సరిపోదని… కాబట్టి ఇంకా కొన్ని సినిమాలు చేశాక మహా భారతాన్ని పట్టాలెక్కిస్తానంటూ… ఈ ప్రాజెక్ట్కు కామా పెట్టేశారు.
అదే టైమ్లో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కూడా తనకు మహాభారతాన్ని రూపొందించే ఆలోచన ఉందన్న విషయాన్ని బయటపెట్టారు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని చెప్పటంతో త్వరలోనే ఆమిర్ మహాభారతం సెట్స్ మీదకు వస్తుందనుకున్నారు ఫ్యాన్స్. చాలా రోజులు వెయిటింగ్ తరువాత ఫైనల్గా మహాభారతం పట్టాలెక్కించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ ఏడాదే మహాభారతం వర్క్ బిగిన్ చేస్తానంటున్నారు ఆమిర్. ఇంత పెద్ద గాథను ఒక్క సినిమాలో చెప్పలేమన్న మిస్టర్ పర్ఫెక్షనిస్ట్, సిరీస్గా ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. చాలా మంది దర్శకులు ఈ ప్రాజెక్ట్ కోసం పని చేయబోతున్నారని వెల్లడించారు. కథ సిద్ధమయ్యేకే కాస్టింగ్ ఎవరన్నది నిర్ణయిస్తామని, తాను నటించేది లేనిది ఇప్పడే చెప్పలేనంటూ క్లారిటీ ఇచ్చారు.
ఆల్రెడీ మరో పౌరాణిక గాథ రామాయణం వెండితెరకెక్కుతోంది. నితిష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్, రాముడిగా రామాయణం రూపొందుతోంది. రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా తొలి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కానుంది.
ఈ సినిమా సెట్స్ మీదకు రాకముందే వెయ్యి కోట్లతో భారీగా రామాయణాన్ని రూపొందిస్తానని ప్రకటించారు టాలీవుడ్ స్టార్ నిర్మాత అల్లు అరవింద్. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ కూడా ఆడియన్స్ ముందుకు రానుంది.