ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మోదీ అభిమాని ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షర్మిలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ పూల ప్రేమ్ కుమార్ అనే నరేంద్ర మోదీ అభిమాని.. పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై వైఎస్ షర్మిల ఇటీవల స్పందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని మోదీని, దేశ నిఘా వ్యవస్థలను ఉద్దేశించి ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రేమ్ కుమార్ ఫిర్యాదు చేశారు.

మరోవైపు పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ఇటీవల వైఎస్ షర్మిల స్పందించారు. దేశ నిఘా వ్యవస్థలను మోదీ వ్యవస్థలుగా మార్చారని.. ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం మోదీ కోసం పనిచేస్తోందన్నారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేవారి గొంతు నొక్కేందుకు నిఘా వ్యవస్థ పనిచేస్తోందంటూ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామాలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ఏటా రెండు కోట్ల మంది కశ్మీర్ చూడ్డానికి వెళ్తుంటారని. ఇలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ లోపం ఎందుకు వచ్చిందని షర్మిల ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కారణంగానే పహల్గాం ఉగ్రదాడి జరిగిందంటూ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైఎస్ షర్మిలపై పుంగనూరు పోలీసులకు ప్రధాని మోదీ అభిమాని పూల ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనలో 26 మంది పర్యాటకులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాకిస్థాన్ కారణమంటూ కేంద్రం సింధూ జలాల ఒప్పందం అమలు నిలిపివేసింది. అలాగే మన దేశంలో ఉన్న పాకిస్థానీయులు వెంటనే దేశం విడిచిపెట్టి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ నెలాఖరులోపు దేశాన్ని విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది. అటు పాకిస్థాన్ కూడా సిమ్లా ఒప్పందం వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ఘటనతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.