అనంతపురంలో కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది. ఓల్డ్టౌన్లోని ఓ కిరణా షాప్లో సుమారు రూ. 3 వేలు విలువ చేసే సరుకులు తీసుకుని ఉడాయించారు దుండగులు. కారులో టూటౌన్ సీఐ ఉన్నారని.. ఆయన చెప్పిన సరుకులు కట్టాలని షాప్ యజమాని చెప్పాడొక వ్యక్తి. సీఐ సార్ షాప్కొచ్చాడంటే యజమానులకు కచ్చితంగా కొంత భయం ఉంటుంది. దీంతో సదరు వ్యక్తి చెప్పినట్టుగానే సరుకులు కట్టి ఇచ్చాడు షాప్ యజమాని. ఆ సరుకులు తీసుకుని ఠక్కున ఉడాయించారు దుండగులు. అయితే ఆ తర్వాత ఆ కారులో పోలీసులెవరూ లేరని తెలియడంతో.. తాను మోసపోయానని గ్రహించిన దుకాణం యజమాని వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు, కారును గుర్తించారు. ముగ్గురు దుండగులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే కారులో అసలు పోలీసులు ఎవరు లేరని తేల్చి చెప్పారు.