Perecherla To Kondamodu National Highway: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు జిల్లాలోని పేరేచర్ల-కొండమోడు జాతీయ రహదారి విస్తరణ పనులను రూ.881.61 కోట్లతో ప్రారంభించింది. నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయనున్న ఈ మార్గం హైదరాబాద్, అమరావతి మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. భారత్మాల పథకం కింద ఎంపికైన ఈ రహదారికి నిధులు విడుదల కావడంతో పనులు వేగవంతం కానున్నాయి. ఈ హైవే పూర్తయితే పల్నాడు ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుంది.
హైలైట్:
- ఆంధ్రప్రదేశ్లో మరో నేషనల్ హైవేకు శంకుస్థాపన
- ఆ రూట్లో రూ.881.61 కోట్లతో నాలుగు లైన్లుగా ప్లాన్
- అమరావతి నుంచి హైదరాబాద్కు త్వరగా వెళ్లొచ్చు

పల్నాడు ప్రాంతంలో కీలకమైన పేరేచర్ల-కొండమోడు హైవేను విస్తరించాలని ఎంతో కాలంగా స్థానికులు కోరుతున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి టెండర్లు పిలిచినా పనులు ప్రారంభంకాలేదు. ఈ రోడ్డు హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు కీలకమైనది.. ప్రస్తుతం రోడ్డు గోతులమయంగా మారింది. ఈ రోడ్డుపై ప్రయాణించేందుకు వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో సమయంతో పాటూ వ్యయం కూడా పెరుగుతోంది. ఈ రహదారి విస్తరణకు 2022-23లో భారత్మాల పథకం కింద ఎంపిక చేశారు. కానీ నిధులు విడుదల కావడంలో కొన్ని సమస్యలు వచ్చాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చొరవ తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం భారత్మాల రోడ్లను ఎన్హెచ్వో కింద కొనసాగించాలని కోరింది. కేంద్రం ఈ మార్గాన్ని నేషనల్ హైవేగా గుర్తించి నిధులు విడుదల చేసింది. ఈ హైవేలో మేడికొండూరు, సత్తెనపల్లి, కొండమోడు ప్రాంతాల్లో బైపాస్లు నిర్మించనున్నారు. దీనికోసం భూసేకరణ కూడా పూర్తయింది. ప్రస్తుతం పేరేచర్ల-కొండమోడు రోడ్డు 7 నుండి 10 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. ఇప్పుడు నాలుగు వరుసల రోడ్డు ఒక్కోవైపు 8.75 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. మధ్యలో 1.5 మీటర్ల డివైడర్ ఉంటుంది. రెండువైపులా మార్జిన్లు కలిపి మొత్తం 22.5 మీటర్ల వెడల్పుతో రోడ్డును నిర్మిస్తారు.
ఏపీలో కొత్తగా నేషనల్ హైవే నాలుగు లేన్లుగా.. ఆ రూట్లో రూ.881.61 కోట్లతో.. హైదరాబాద్ మరింత త్వరగా వెళ్లొచ్చు
ఈ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ హైవే పూర్తి చేస్తే అమరావతి నుంచి హైదరాబాద్కు కనెక్టివిటీ పెరుగుతుంది.. అలాగే త్వరగా (తక్కువ సమయంలో) వెళ్లొచ్చు. ఈ రహదారి విస్తరణ పూర్తయితే హైదరాబాద్ నుండి రాజధాని అమరావతికి ప్రయాణ సమయం తగ్గుతుందని అధికారులు తెలిపారు. అలాగే సీఆర్డీఏ నిర్మించే ఔటర్ రింగ్ రోడ్డుకు సత్తెనపల్లి దగ్గర ఈ రోడ్డు కలుస్తుంది. పల్నాడు ప్రాంతంలో ముఖ్యమైన హైవే కావడంతో పాటుగా హైదరాబాద్ వెళ్లేందుకు ముఖ్యమైన రోడ్డు కావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. ఈ హైవే పనులు త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.