అమరావతి, మే 8: 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇచ్చేందుకు ఎన్సీఈఆర్టీ సిలబస్తో కొత్త పాఠ్యపుస్తకాలను సిద్ధం చేశారు. అలాగే ప్రశ్నపత్రాల నమూనాల్లోనూ మార్పులు చేశారు. ఈ ఏడాది నుంచి కొత్తగా ఒక్క మార్కు ప్రశ్నలు ప్రవేశపెట్టనున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రశ్నాపత్రంలో 2, 4, 8 మార్కుల ప్రశ్నలను కొత్తగా ప్రవేశపెడుతున్నారు. దీంతో ప్రతి టెస్ట్ బుక్ చివరిలో రెండు ప్రశ్నపత్రాల నమూనాలను ముద్రించారు. అలాగే ఇప్పటి వరకూ మ్యాథమెటిక్స్లో రెండు పేపర్ల విధానం ఉండగా.. ఈ ఏడాది నుంచి రెండు పేపర్లకు బదులు ఒక్కటే పేపర్ ఉంటుంది. గతంలో 150 మార్కులకు ఈ పరీక్ష నిర్వహించేవారు. ఈ ఏడాది నుంచి దీన సిలబస్ తగ్గించి దీన్ని 100 మార్కులకు కుదించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులను 85 మార్కులకు పెంచారు. గతంలో ఈ సబ్జెక్టు పరీక్షలు 60 మార్కులకు ఉండేవి.
మొదటి ఏడాది 15, రెండో ఏడాది 15 మార్కులు కలిపి 30 మార్కులకు ప్రాక్టికల్స్కు కేటాయించేవారు. ఇక వృక్ష, జంతు శాస్త్రాలను కలిపేసి జీవశాస్త్రంగా తీసుకొచ్చారు. సెకండ్ ల్యాంగ్వేజ్ స్థానంలో వేరే సబ్జెక్ట్ను ఎంపిక చేసుకోవచ్చు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మొత్తం ఐదు సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. ఆరో సబ్జెక్టును కూడా అభ్యర్థులు ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఇందులో ఉత్తీర్ణత తప్పనిసరి కాదు. ఆరో సబ్జెక్టు మార్కులకు ప్రత్యేక మెమో ఇస్తారు. ఇందులో ఫెయిలైనా మార్కుల మెమోలు జారీ చేస్తారు. ఇలా సిలబస్ మార్పు నుంచి పరీక్ష విధానం వరకు ఇంటర్ విద్యలో అనేక మార్పులు చేశారు.
అలాగే ఇంటర్ విద్యార్థులకు బోధించే అధ్యాపకులకు సైతం ప్రత్యేకంగా హ్యాండ్ బుక్ను ఇంటర్ బోర్డు రూపొందించింది. ఇందులో ప్రతి పాఠం ముగిసిన తర్వాత ప్రశ్నలు ఉంటాయి. అధ్యాపకులంతా ఒకే పద్ధతిలో బోధన చేసేలా ఈ హ్యాండ్ బుక్ను ప్రత్యేకంగా రూపొందించారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యలో మొదటిసారి ఈ హ్యాండ్ బుక్ను తీసుకువస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.