
తెలంగాణలో నకిలీ కన్సల్టెన్సీల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇటీవల కాలంలో విదేశాలకు వెళ్తున్న వారిని టార్గెట్ చేసి విదేశాల్లో ఉద్యోగాలు ఇస్తామంటూ మాయమాటలు చెప్పు అమాయకులను మోసం చేస్తున్నాయి. చాలా కన్సల్టెన్సీలకు PGE (protector general of emigrants) కింద రిజిస్టర్ కాకుండానే యథేచ్ఛగా తమ కన్సల్టెన్సీలను నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు ఇదే అమాయకులకు శాపంగా మారింది.
బాధితుల దగ్గర నుండి లక్షల రూపాయల్లో డబ్బులు వసూలు చేసి విదేశాలకు పంపించి అక్కడ ఉద్యోగం ఉందని ఆశ చూపిస్తున్నారు. తీరా అక్కడికి వెళ్ళాక ఎలాంటి ఉద్యోగం లేకపోవడంతో మోసపోయామని గ్రహిస్తున్నారు. తిరిగి వచ్చేందుకు కూడా డబ్బులు లేక, ఎంబసీ అధికారులను ఆశ్రయించి ఎలాగోలా స్వదేశానికి తిరిగి వచ్చి ఇక్కడ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
హైదరాబాద్లో రెండు కన్సల్టెన్సీల నిర్వాకాన్ని తెలంగాణ సీఐడీ పోలీసులు బయటపెట్టారు. సికింద్రాబాద్ మారేడ్పల్లి వేదికగా Eagle Expert mmigration అనే కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. కూకట్పల్లిలో ఉన్న Abroad Study కన్సల్టెన్సీతో కుమ్మక్కై చాలామంది బాధితుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేశారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ నమ్మించారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఎలాంటి ఉద్యోగం లేకపోవడంతో మోసపోయామని బాధితులు వాపోతున్నారు. ముఖ్యంగా మాల్టాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని రెండు తెలుగు రాష్ట్రాల నుండి సుమారు వంద మందికి పైగా బాధితుల దగ్గర నుండి లక్షల రూపాయలు వసూలు చేశారు. ఒక బాధితుడి దగ్గర నుండి సుమారు 5 లక్షల రూపాయల డబ్బులను వసూలు చేశారు. అక్కడి వెళ్లి మోసపోయామని గ్రహించిన బాధితులు, ఎలాగోలా స్వదేశానికి తిరిగి వచ్చారు.
తిరిగి హైదరాబాద్ చేరుకున్న బాధితులు తమ మోసపోయిన తీరును వివరిస్తూ పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు కేసులు నమోదు కావటంతో EOW పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో ఈ కన్సల్టెన్సీల అసలు వ్యవహారం బయటపడింది. కన్సల్టెన్సీ నిర్వహకులను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా కన్సల్టెన్సీ డైరెక్టర్లను సీఐడీ పోలీసులు విచారిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కన్సల్టెన్సీలను నమ్మవద్దు అని విదేశాలకు వెళుతున్న వారికి తెలంగాణ సీఐడీ పోలీసులు సూచనలు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..