కష్టాన్ని నమ్ముకున్న వారికి ఎప్పటికి నష్టం జరగదని నిరూపించింది ఓ ఆటోవాలా కథ. డబ్బు, హోదా ఉన్న వారికి మాత్రమే కీలక పదవులు దక్కే ఈ రోజుల్లో పార్టీనే నమ్ముకుని.. కష్టకాలంలో జెండా మోసిన ఆ ఆటోవాలను అదృష్టం వరించింది. వివరాల్లోకి వెళితే నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రానికి చెందిన సామాన్య కాంగ్రెస్ కార్యకర్త జి.కళ్యాణ్ గత కొన్నేళ్లుగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కష్టకాలంలోనూ పార్టీ జెండా వదలకుండా నికార్సైన కాంగ్రెస్ సైనికుడిగా కష్టపడ్డాడు. నియోజక వర్గంలో దశాబ్దన్నర కాలంగా కాంగ్రెస్ గెలుపు సాధించకపోయినా పార్టీలు మారకుండా ప్రాణం కంటే ఎక్కువగా పార్టీ ఎదుగుదలకు చెమటోడుస్తూ వస్తున్నాడు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తన లాంటివారి కష్టాలు తీరుతాయని భావించాడు. కానీ అతను కలలో కూడా ఊహించని ఓ పదవి తనను వరిస్తుందని మాత్రం ఊహించలేదు.
ఆటో నడుపుతూ.. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న జి.కళ్యాణ్ అనే ఆటోవాలను ఆ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి వరించింది. దీంతో ఆ మండలంలో పండగ వాతవరణం నెలకొంది. కాంగ్రెస్ అంటేనే సామాన్యుల పార్టీ అంటూ అక్కడి హస్తం తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పదవి కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొన్నా మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాత్రం పట్టుపట్టి సామాన్య కార్యకర్తకు ఈ పదవి ఇప్పించడంలో సక్సెస్ అయ్యారనే టాక్ నడుస్తోంది. వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి వరించడంతో సంబరంలో ముగినిపోయిన ఆటోవాలా కల్యాణ్ పదవి స్వీకారానికి సైతం అదే ఆటోలో వ్యవసాయ మార్కెట్కు రావడం అందరిని ఆకట్టుకుంది. ఆటో నడుపుతున్న క్రమంలోనే, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి నుంచి ఫోన్ రావడం.. నీకు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఛాన్స్ వచ్చింది ప్రమాణ స్వీకారానికి రావాలని కళ్యాణ్ను ఆహ్వానించడంతో ఇది కలనా నిజమా అంటూ ఆశ్చర్యానికి లోనయ్యాడంట ఆటోవాలా కళ్యాణ్. వెంటనే అదే ఆటోలో ఏఎంసీ కార్యాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. ఫైరవీలకు పాతరేసి అంతటా ఇలా సామాన్యులకు పట్టం కడితే పార్టీ మరింత ప్రజాదరణ పొందుతుందని జనం చర్చించుకుంటున్నారు.