తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని భూ సమస్యలకు చెక్ పెట్టేందుకు భూభారతి అనే పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగానే ఇప్పుడు రాష్ట్రంలోనే భూ సమస్యలు తీర్చడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో భూముల కొలతలను నిర్ధారించడానికి డ్రోన్లతో భూ సర్వే చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మొదటగా రాష్ట్రంలోని ఓ ఐదుగ్రామాలను ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని భూ సర్వేలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఆయా గ్రామాల్లో భూ సర్వే నిర్వహించే బాధ్యతలను ఓ సర్వే ఏజెన్సీకి అప్పగించింది.
ఇక ఇందులో భాగంగానే ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే ఏజెన్సీలు డ్రోన్లతో భూ సర్వే జరపడం స్టార్ట్ చేశారు. అచ్చం విమానం ఆకారంలో ఉన్న ఈ ఆధునిక డ్రోన్లు.. పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసి గ్రామాల్లో ఒకటైన సంగారెడ్డి జిల్లా షాహెద్ నగర్లో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. ఇలా డ్రోన్లతో సర్వే చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి కావడంతో రైతులు ఈ సర్వేను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ప్రస్తుతం డ్రోన్లతో జరుపుతున్న ఈ సర్వే సక్సెస్ అయితే.. ఇకపై రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ ఇలాంటి విమానపు ఆకారంలోని డ్రోన్లతోనే భూముల కొలతలు తేల్చనున్నారు అధికారులు.
అయితే సాధారణ డ్రోన్ల కన్నా ఈ ఎరోప్లేన్ డ్రోన్లతో భూముల కొలతల్లో ఖచ్చితత్వం ఉంటుందని చెబుతున్నారు అధికారులు. ప్రస్తుతం షాహెద్ నగర్ లో 21 సర్వే నంబర్లలో 574 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ సర్వే నెంబర్లో 279 మంది రైతులకు పాస్ బుక్కుల ఉన్నాయి. ముందుగా గ్రామానికి హద్దులు నిర్ణయించి. గ్రామ బౌండరీలు తేల్చాక సర్వే నంబర్ల వారీగా భూములను కొలిచి మ్యాపులు తయారు చేయనున్నారు అధికారులు. ప్రస్తుతం గ్రామాల శివారు ఆధారంగా అక్కడ పాయింట్లు అమర్చి డ్రోన్లతో కొలతలు వేస్తున్నారు అధికారులు. ఈ డ్రోన్లతో ఒకే రోజు 2 వేల ఎకరాల భూముల వరకు సర్వే చేయొచ్చు అని అధికారులు, సర్వే ఏజెన్సీ వాళ్ళు చెబుతున్నారు.
వీడియో చూడండి..
ఈ డ్రోన్ సర్వేలో ఖచ్చితత్వం ఉందా.. లేదా అని నిర్ధారించు కోవడానికి డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్లో మరో సర్వే చేస్తున్నారు. అంటే మొత్తం రెండు రకాల సర్వేలను చేసిన తర్వాత భూ హద్దులను నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలోని సర్వేయర్లు కూడా ఇదే విధానాన్ని పాటిస్తున్నారు. రెండు రకాల సర్వేలో తేడాలు ఉన్నాయా లేక రెండింటిలోనూ ఒకే రకమైన కొలతలు వచ్చాయా? అని తేల్చిన తర్వాతనే మ్యాపులు సిద్ధం చేస్తారు అధికారులు. అయితే నిజాం రాజుల కాలంలో గొలుసులతో భూముల కొలతలు వేసి ప్రతి గ్రామానికి టీపన్ నక్షా తయారు చేశారు నాటి అధికారులు. ఈ టీపన్ నక్షాలోని సర్వే నంబర్ల ఆధారంగానే భూముల విస్తీర్ణం, గ్రామాల్లోని రహదారులు, బాటలు సైతం ఉంటాయి. గడిచిన 75 ఏళ్లుగా భూములసర్వేకు టిప్పన్ నక్షానే ప్రమాణికంగా ఉండగా.. ఈ తాజా సర్వేతో ప్రతి గ్రామానికి డిజటల్ మ్యాపులు సిద్ధం చేయనున్నారు అధికారులు.
తాజాగా వచ్చిన ఈ డ్రోన్ల డిజిటల్ సర్వేతో ఇప్పటిదాకా భూములకు ఆధారంగా ఉన్న టీపన్ నక్షా కథ కంచికి చేరనుందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టి ఈ డ్రోన్ల సర్వే సక్సెస్ అయితే..రాష్ట్రమంతా ఇదే సర్వేని అమలు చేయనున్నారు అధికారులు. అప్పుడు టీపన్ నక్షాతో పని ఉండదని సీనియర్ సర్వేయర్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో భూములు కొలవాలి అంటే గొలుసుల ద్వారా చాలా ఇబ్బంది అయ్యేదని, అంతే కాకుండా ఈ కొతల వల్ల గొడవలు కూడా అయ్యేవని.. ఇప్పుడు ఆ బాధలు ఏమి లేకుండా డ్రోన్స్తో కొలతలు త్వరగా పూర్తి చేసుకొవచ్చు అంటున్నారు రైతులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..