
భూ వివాదం ఆ సోదరులను రాక్షసులుగా మార్చింది. తోబుట్టువులే మానవ మృగాలు అయ్యారు. గట్టు పంచాయతీ వారిని రాక్షసులుగా మార్చి నిండు ప్రాణాలు బలి తీసుకునేలా చేసింది. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ హత్య స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలంలో ఈ దారుణహత్య జరిగింది. సాగు భూమి సరిహద్దు వివాదంలో ముగ్గురు అన్నదమ్ముళ్ళ మధ్య నెలకొన్న పంచాయతీ అన్న హత్యకు దారితీసింది. సీరోల్ మండల కేంద్రానికి చెందిన వల్లపు లింగయ్య అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. లింగయ్య తనకున్న 16 ఎకరాల భూమిని తన కుమారుల పేరు మీద పట్టా చేయించాడు. పెద్ద భార్య మరణించడంతో ఆమె తల్లిగారి ఊరిలో ఆమె పేరు మీద ఉన్న భూమిని అమ్మి సీరోల్ గ్రామంలో 16 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
లింగయ్య ముగ్గురు కుమారులకు సమానంగా భూమిని పంపిణి చేశారు. జ్యేష్ట భాగంగా పెద్ద పెద్ద కుమారుడైన వల్లపు కృష్ణకు తండ్రి లింగయ్య ఒక ఎకరం భూమి అదనంగా పంచి ఇచ్చాడు. అప్పటి నుంచి వారి కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. భూ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ ముదిరి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. పోలీసులు విచారణ జరుపుతున్న క్రమంలోనే పెద్ద కొడుకు కృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు. అతని తమ్ముడు నరేశ్, అతని స్నేహితులతో కలసి కత్తితో దాడికి పాల్పడగా కృష్ణ ఆక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి లింగయ్యకు తీవ్ర గాయాలవగా ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న సేరోల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడ్డవారిని వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని మృతుని బార్య, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మృతుని భార్య సత్యవతి పిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు ఐదుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..