Andhra Pradesh Temples Bolebaba Dairy Adulterated Ghee : తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో సిట్ విచారణ సంచలన విషయాలు వెల్లడించింది. ఉత్తరాఖండ్ కు చెందిన భోలేబాబా డెయిరీ, పలు దేవాలయాలకు కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి హరిమోహన్ రాణా బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. సిట్ అధికారులు భోలేబాబా డైయిరీ మాజీ డైరెక్టర్లను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
హైలైట్:
- భోలేబాబా డెయిరీ అక్రమాలు ఒక్కొక్కటిగా
- ఏపీలోని ఆ ఆలయాలకు కల్తీ నెయ్యి సరఫరా
- ఆ కంపెనీ పేరుతో నెయ్యిని పంపించారు

తిరుమల మాత్రమే కాదు మరో ఐదు ఆలయాలకు కల్తీ నెయ్యి పంపారు.. సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు!
మరోవైపు నెల్లూరు ఏసీబీ కోర్టులో భోలేబాబా డెయిరీ జనరల్ మేనేజర్ హరిమోహన్ రాణా మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణ చేపట్టగా ఏపీపీ వాదనలు వినిపించారు. ‘టీటీడీ 2022లో భోలేబాబా డెయిరీని బ్లాక్లిస్ట్లో పెట్టింది. ఆ తర్వాత ‘మాల్గంగ’ అనే మరో డెయిరీని తెరపైకి తెచ్చారు. ఈ కంపెనీకి కమీషన్ చెల్లించి కల్తీ నెయ్యిని తయారు చేశారు.. సుగంధ ఆయిల్స్, పామోలిన్ వంటి పదార్థాలను కలిపారు. భోలేబాబా డెయిరీనే పరోక్షంగా టీటీడీకి పంపింది. గతంలో కొన్ని సంస్థల దగ్గర నెయ్యి కొనుగోలు చేసి టీటీడీకి సరఫరా చేశామని హరిమోహన్ రాణా చెప్పారు.. అయితే అది అవాస్తవమని విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో నిందితుడు మాస్టర్మైండ్.. హరిమోహన్ ఈ ఎపిసోడ్లో సూత్రధారి.. బయటకు వస్తే సాక్ష్యాధారాలు మాయం చేస్తారు.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది’ అని ఏపీపీ వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ను తిరస్కరించారు. తిరుమల ఆలయానికి కల్తీ నెయ్యి ఘటనలో ఉత్తరాఖండ్ కు చెందిన భోలేబాబా డైయిరీ మాజీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్లను సిట్ అరెస్ట్ చేసింది. తిరుపతి సిట్ కార్యాలయంలో వీరిని ప్రశ్నించారు.