TTD Respond To Bhumana Karunakar Reddy Comments: తిరుమల ఆలయంలో సంప్రదాయాల ఉల్లంఘన జరుగుతోందని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించగా, టీటీడీ వాటిని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. వేద పారాయణానికి ప్రాధాన్యత తగ్గిస్తున్నారనే విమర్శలను తోసిపుచ్చింది. భక్తుల సౌకర్యార్థం అనేక చర్యలు తీసుకుంటున్నామని, దర్శనాల్లో పారదర్శకత పెంచామని తెలిపింది. ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించింది. అసలు ఏం జరుగుతోంది తిరుమలలో?
హైలైట్:
- టీటీడీపై భూమన సంచలన ఆరోపణలు
- కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై టీటీడీ క్లారిటీ
- అవాస్తవాలను నమ్మొద్దన్న టీటీడీ

అర్చకుల్ని గౌరవిస్తున్నాం
‘అర్చకులను తనిఖీ చేయడమన్నది పూర్తిగా వాస్తవ దూరం. అర్చకులకు ఇచ్చే గౌరవంలో ఎలాంటి లోటుపాట్లు లేవు. వారికి ఇచ్చే గౌరవం వారికి ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆలయం లోపల ఇటీవల కాలంలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఆలయం లోపల కూడా భక్తుల నుండి దర్శనాలు, తీర్థ ప్రసాదాలు, తదితర అంశాలపై అభిప్రాయ సేకరణ విధానాన్ని ప్రారంభించి పారదర్శకతకు పెద్దపీట వేశాం. ఈ విధానంపై భక్తుల నుండి ప్రశంసలు అందుతున్నాయి’ అని తెలిపింది టీటీడీ.
పీఠాధిపతులకు నోటీసులు ఇవ్వలేదు
‘ఇది కూడా పూర్తిగా అవాస్తవం. గతంలో టీటీడీ కేటాయించిన స్థలానికన్నా ఎక్కువ స్థలం ఆక్రమించి నిర్మాణం చేపట్టినందుకు కోర్టు ఆదేశాలు ప్రకారం విశాఖ శారదా పీఠం, మరో ఒకటి రెండు మఠాలపై నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలి. గత సంవత్సర కాలంలో టీటీడీ తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలకు అన్ని మఠాలు తమ సహకారాన్ని అందిస్తున్నాయి. టీటీడీ కూడా పలు మఠాలకు నిబంధనల ప్రకారం మరమ్మతులు, ఆధునీకరణ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది’ అని క్లారిటీ ఇచ్చారు.
భక్తుల దర్శనాల విషయంలోనూ అవాస్తవాలు
‘ఏఐ టెక్నాలజీతో దర్శనం చేయిస్తామని చెప్పిభక్తులను అడ్డుకుంటున్నారని అవాస్తవాలు పలికే ముందు నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు విశ్లేషించి భక్తుల సౌకర్యార్థం శాస్త్రీయ పద్ధతిలో సమయ పాలన పాటిస్తూ, క్యూలైన్లను పకడ్బందీగా నిర్వహిస్తూ వస్తున్నాం. బయట క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు 22 ఫుడ్ కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేసి శ్రీవారి సేవకుల ద్వారా వారికి అన్న ప్రసాదాలు, పాలు, టీ, కాఫీ, మజ్జిగ, స్నాక్స్ ను విధిగా టైమ్ లైన్ ప్రకారం అందిస్తూ వస్తున్నాం. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అత్యధిక స్థాయిలో గురు, శుక్ర, శని, ఆది వారాల్లో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాలను అందిస్తున్నాం. టీటీడీ అందిస్తున్న వివిధ సౌకర్యాలపై మూడు విధాలుగా భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయ సేకరణ చేస్తున్నాం. IVRS, WHATSAPP, శ్రీవారి సేవకులు ద్వారా సేకరిస్తున్న అభిప్రాయాల్లో 90 శాతానికి పైగా భక్తులు టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాద, వసతి, తాగునీరు, లడ్డూ ప్రసాదాలు, తదితర సేవలపై సంతృప్తిని వ్యక్తం చేయడం విశేషం. ఇక ఏఐ ప్రాజెక్టు సాకారం కావడానికి టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోంది’ అని ఏఐ అంశం, భక్తులపై దర్శనాలపై టీటీడీ స్పష్టత ఇచ్చింది.
తిరుమలలో దర్శనాలపై ఆ ప్రచారాన్ని నమ్మొద్దు.. భక్తుల్ని అడ్డుకోవడం లేదు: టీటీడీ
పరకామణిలో తనిఖీ
‘2023 సంవత్సరం పరకామణిలో జరిగిన ఒక సంఘటన కారణంగా ఏర్పడిన అపవాదును తొలగించడానికి ఒక సంవత్సర కాలంగా ఒక పకడ్బందీ వ్యవస్థను ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ వ్యవస్థపై కోల్పోయిన నమ్మకాన్ని పున:స్థాపించేలా పరకామణిలో SoP తయారు చేశాం. ఎవరైనా పరకామణిలో ప్రవేశించాలంటే ఈ SoP లో పేర్కొన్న విధంగా భద్రతా తనిఖీలు చేయడం జరుగుతుంది. ఇంతటి పకడ్బందీ వ్యవస్థ వల్ల గత సంవత్సర కాలంగా పరకామణిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం’ అని టీటీడీ ప్రకటనలో తెలిపింది. వాస్తవాలు పైవిధంగా ఉంటే టీటీడీ మాజీ ఛైర్మన్ ఆధ్యాత్మిక సంస్థపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని.. వ్యవస్థపై ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని కోరుతున్నామంది టీటీడీ.