AP Govt 5 Days Work Week For Employees: ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది! వారానికి ఐదు రోజుల పని విధానం మరో ఏడాది పాటు పొడిగించబడింది. దీనితో ఉద్యోగులు మరింత సంతోషంగా ఉన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి! గిరిజన పాఠశాలల ఉపాధ్యాయులకు, సహకార సంఘాల సిబ్బందికి కూడా ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది.
హైలైట్:
- ఏపీ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త
- వారంలో ఐదు రోజులు పని దినాలు
- వారంలో రెండు రోజులు సెలవులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగుల కోసం చంద్రబాబు నాయుడు కొన్ని ఏర్పాట్లు చేశారు. ఉద్యోగులకు క్వార్టర్స్ ఇచ్చారు. వారానికి 5 రోజులు మాత్రమే పనిచేసే అవకాశం కల్పించారు. దీనివల్ల ఉద్యోగులు శని, ఆదివారాల్లో హైదరాబాద్ వెళ్లి కుటుంబంతో గడిపే వీలు కలిగింది. ఈ విధానం వల్ల ఉద్యోగులు సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం మరికొన్ని నిర్ణయాలు
ఏపీ ప్రభుత్వం గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న 1,268 మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్(సీఆర్టీ) సేవలను 11 నెలల పాటు ప్రభుత్వం రెన్యువల్ చేసింది. ఈ ఏడాది జూన్ 1 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు వీరు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే రాష్ట్రంలోని 1,948 ప్రాథమిక సహకార పరపతి సంఘాలకు(పీఏసీఎస్) జులై నెలాఖరు వరకు ఇప్పుడు ఉన్న అధికార పర్సన్ ఇన్ఛార్జులే కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్డబ్ల్యూ)లో పనిచేసే సిబ్బందికి వారి మూల వేతనంపై 30 శాతం మేర ప్రత్యేక అలవెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ సచివాలయ ఉద్యోగులకు గుడ్న్యూస్.. వారంలో రెండు రోజులు సెలవులు
విజయనగరంలోని ఏపీఎస్పీ 5వ బెటాలియన్ అదనపు కమాండెంట్గా సి.రాజారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆక్టోపస్లో అదనపు కమాండెంట్గా ఉన్న ఆయన్ను విజయనగరానికి బదిలీ చేస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు ఇచ్చారు. కాలుష్య నియంత్రణ మండలికి చెందిన ఎనలిస్ట్ గ్రేడ్-2 పోస్టుల రాత పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. 18 పోస్టుల భర్తీకి రాత పరీక్షను గత మార్చిలో నిర్వహించారు. ప్రొవిజనల్ లిస్టులో పేర్కొన్న అభ్యర్థులకు వచ్చేనెల 1న ధ్రువపత్రాల పరిశీలన కమిషన్ కార్యాలయంలో ఉంటుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ ఓ ప్రకటన విడుదల చేసింది.