ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్ట్లో యంగ్ టీమిండియా అద్భుతమైన స్టార్ట్ అందుకుంది. తొలి రోజే ఇద్దరు భారత బ్యాటర్లు సెంచరీతో చెలరేగారు. రోజంతా కలిసి ఇంగ్లాండ్ కేవలం 3 వికెట్లు మాత్రమే పడగొట్టింది. అయితే.. ఈ మ్యాచ్లో సెంచరీతో గిల్ సూపర్ రికార్డ్ సాధించాడు.
శుక్రవారం టెస్ట్ క్రికెట్లో కెప్టెన్సీ అరంగేట్రంలోనే సెంచరీ చేసిన ఐదవ భారత కెప్టెన్గా శుబ్మన్ గిల్ నిలిచాడు. అయితే గిల్ కంటే ముందు మరో నలుగురు భారత ఆటగాళ్లు ఈ ఘటన సాధించారు. మరీ నాలుగురు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంగ్లండ్తో లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ తో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. ఇలా కెప్టెన్గా తొలి టెస్ట్లోనే సెంచరీతో చేసిన ఐదో భారత ఆటగాడిగా గిల్ కొత్త చరిత్ర లిఖించాడు. అయితే గిల్ కంటే ముందు విజయ్ హజారే, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్సర్కార్, విరాట్ కోహ్లీలు ఈ ఘనత సాధించారు.
1951లో విజయ్ హజారే ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్గా తన తొలి టెస్ట్లో 164 పరుగులు నాటౌట్గా నిలిచాడు. ఆ తర్వాత 1976లో సునీల్ గవాస్కర్ న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్గా 116 పరుగులు సాధించాడు. 1987లో దిలీప్ వెంగ్ సర్కార్ వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 102 పరుగులు చేశాడు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 2014లో కెప్టెన్గా తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతూ.. ఆస్ట్రేలియాపై 115 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
ఇక ఇంగ్లాండ్తో తొలి రోజు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. తొలి రోజు గిల్ అజేయ సెంచరీ, జైస్వాల్ 101 పరుగులు, రిషబ్ పంత్ అజేయ అర్ధ సెంచరీతో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ తరఫున బెన్ స్టోక్స్ (2/43), బ్రైడాన్ కార్స్ (1/70) మాత్రమే వికెట్లు పడగొట్టారు.