సంతానోత్పత్తి సామర్థ్యం లేదనే కారణంతో ట్రాన్స్జెండర్ను మహిళగా పరిగణించకూడదనే వాదనను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ట్రాన్స్జెండర్లకు లింగ గుర్తింపును స్వయంగా నిర్ణయించుకునే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిందని గుర్తు చేసింది. వరకట్న వేధింపుల కేసు కింద ఫిర్యాదు చేసే హక్కు కూడా వారికి ఉంటుందని కోర్టు తేల్చి చెప్పింది. అయితే ఈ కేసులో వేధింపులు జరిగినట్లు ఆధారాలు లేనందున.. ఆమె భర్త, అత్తమాలపై పెట్టిన కేసును కొట్టివేసింది.
హైలైట్:
- ప్రేమించి పెళ్లిచేసుకున్న ట్రాన్స్జెండర్ మహిళ
- అత్తింటివారిపై 498 ఏ కింద వరకట్న వేధింపుల కేసు
- సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు

తమ కుటుంంబంపై పెట్టిన కేసును కొట్టివేయాలని కృష్ణమూర్తి, అతడి తల్లిదండ్రులు 2022లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రాన్స్జెండర్కు సంతానోత్పత్తి సామర్థ్యం ఉండదని, కాబట్టి ట్రాన్స్ఉమన్ను మహిళగా పరిగణించలేమని వారి తరపు న్యాయవాది వాదించారు. అందువల్ల షబానాకు IPC సెక్షన్ 498(A) కింద కేసు పెట్టే అర్హత లేదని అన్నారు. వేధింపులకు గురి చేశారనడానికి ఆధారాలు లేవని కూడా ఆయన వాదించారు. పోలీసుల తరఫున ఏపీపీ ప్రియాంక లక్ష్మి వాదనలు వినిపించారు.
ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. పుట్టుకతో వచ్చిన లింగమే శాశ్వతం కాదని అన్నారు. ట్రాన్స్జెండర్ల హక్కులను కాపాడటానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను గుర్తు చేశారు. లింగ గుర్తింపు కోసం ట్రాన్స్జెండర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారని, పుట్టినప్పుడు పేర్కొన్న లింగాన్నే తప్పనిసరిగా అనుసరించాల్సిన అవసరం లేకుండా ఆదేశాలివ్వాలని కోరారని తెలిపారు. దీనికి సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించి రాజ్యాంగం కల్పించిన హక్కులు పురుషులు, స్త్రీలకే పరిమితం కాదని, ట్రాన్స్జెండర్లకు కూడా వర్తిస్తాయని తెలిపిందన్నారు.
ఈ తీర్పునకు అనుగుణంగా 2019లో ట్రాన్స్జెండర్ పర్సన్స్ (హక్కుల రక్షణ) చట్టాన్ని తీసుకొచ్చారని న్యాయమూర్తి గుర్తు చేశారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని వివాహం తర్వాత భిన్న లింగసంపర్క సంబంధం ఉన్న ట్రాన్స్ఉమన్/ట్రాన్స్జెండర్కు 498(A) కింద కేసు పెట్టే హక్కు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో కట్నం కోసం వేధించారని చెప్పడానికి తగిన ఆధారాలు లేనందున కేసును కొట్టివేస్తున్నట్లు తెలిపింది.
ట్రాన్స్ఉమన్ వరకట్న వేధింపుల కేసు పెట్టొచ్చా.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
‘స్త్రీత్వాన్ని సంతానోత్పత్తికి పరిమితం చేసే సంకుచిత భావన రాజ్యాంగ స్ఫూర్తిని తక్కువ చేసి చూడటమే’ అని కోర్టు పేర్కొంది. పిల్లల్ని కనగలిగితేనే స్త్రీ అవుతారనే ఆలోచన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. రాజ్యాంగం ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కును కల్పించిందని గుర్తు చేసింది. ట్రాన్స్జెండర్లకు కూడా సమాన హక్కులు ఉంటాయని తేల్చి చెప్పింది.
ట్రాన్స్జెండర్లకు తమ లింగ గుర్తింపును తామే నిర్ణయించుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, పిల్లల్ని కనే సామర్థ్యం లేదనే కారణంతో ట్రాన్స్ఉమన్కు స్త్రీ హోదాను నిరాకరించడం సరికాదని హైకోర్టు తేల్చి చెప్పింది. అలాగే, IPC సెక్షన్ 498(A) కింద కేసు పెట్టే హక్కు లేదనడం కూడా ఆమె పట్ల వివక్ష చూపడమేనని కోర్టు అభిప్రాయపడింది. ట్రాన్స్ఉమన్కు ఆమె భర్త, అత్తమామలు, బంధువులపై పోలీసులకు ఫిర్యాదు చేసే హక్కు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.