ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుందని ఆరోపిస్తూ.. ఇజ్రాయెల్ వారం క్రితం ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్పై దాడి చేసింది. ఆ తర్వాత ఇరాన్ కూడా ‘ట్రూ ప్రామిస్ 3’ పేరుతో ఇజ్రాయెల్పై ప్రతిదాడికి దిగింది. ఇరు దేశాల మధ్య వారం రోజులకు పైబడి దాడులు జరుగుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ చర్చలకు రావాలని, తమతో అణు ఒప్పందం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. కానీ, ఇరాన్ అమెరికా వార్నింగ్ను పట్టించుకోలేదు. దీంతో తాజాగా అమెరికా కూడా ఈ యుద్ధంలో భాగమైంది. శనివారం రాత్రి ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై దాడులు నిర్వహించింది. దీంతో పరిస్థితి మరింత తీవ్రమైంది.
ఏకంగా అమెరికానే యుద్ధ బరిలోకి దిగడంతో యావత్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే.. ఇజ్రాయెల్, ఇరాన్ వివాదంలో అమెరికా జోక్యం చేసుకోవద్దని ఇప్పటికే రష్యా హెచ్చరించింది. అలాగే ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన తొలి దాడిన చైనా కూడా ఖండించింది. ప్రపంచంపై ఆధిపత్యం కోసం అమెరికా, చైనా మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న తరుణంలో.. ఇప్పుడు ఇజ్రాయెల్ తరఫున అమెరికా యుద్ధంలోకి ప్రత్యక్షంగా బరిలోకి దిగడంతో ఇప్పుడు ఇరాన్కు మద్దతుగా రష్యా, చైనా వస్తే పరిస్థితి ఏంటని అనేక దేశాలు భయపడుతున్నాయి. మెల్లమెల్లగా ఈ వివాదం మూడో ప్రపంచ యుద్ధం దిశగా వెళ్తోందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇప్పటికే మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం చూసిన ఈ ప్రపంచం.. మూడో ప్రపంచ యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ, అదే అనివార్యం అయితే.. గతంలో ఎన్నడూ చూడనంత విధ్వంసం జరగడం ఖాయం. ఎందుకంటే.. ఇప్పుడు అనేక దేశాల వద్ద ఎంతో శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. వేల కిలో మీటర్ల లక్ష్యాలను ఛేదించగల క్షిపణులు ఉన్నాయి. అంతెందుకు.. చాలా దేశాల వద్ద అణుబాంబులు ఉన్నాయి. ఏ ఒక్క దేశం తప్పు చేసినా.. అది ప్రపంచ అంతానికి కారణం కూడా కావొచ్చు. యుద్ధం వల్ల కొన్ని, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని కొన్ని, ఆర్థిక మాంద్యం ఎదుర్కొని కొన్ని.. దాదాపు అన్ని దేశాలు మూడో ప్రపంచ యుద్ధంతో మునుపెన్నడని చూడని భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
భారత్ దారి ఎటు..?
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని చాలా మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఒక వేళ నిజంగానే యుద్ధం వస్తే.. భారత్ ఎవరి వైపు నిలుస్తుందనే ప్రశ్నలు కూడా చాలా మందిలో తలెత్తుతున్నాయి. పాత మిత్రుడైన ఇరాన్ వైపు నిలుస్తుందా? లేక ఇజ్రాయెల్, అమెరికాతో జత కడుతుందా అని చర్చలు జరుగుతున్నాయి. నిజానికి భారత ప్రభుత్వం రెండు దేశాల మధ్యలో జరిగే యుద్ధంలో ప్రత్యేక్షంగా పాల్గొనదు. ఎందుకంటే.. భారత విదేశాంగ విధానంలో ఎంతో కీలకమైన అలీన విధానాన్ని అనుసరిస్తుంది. ఈ అలీన విధానం(నాన్ అలైన్మెంట్ పాలసీ) ఇండియాను ప్రత్యేకంగా చేస్తుంది. ప్రపంచం రెండు గ్రూపులుగా విడిపోయినప్పుడు ఏ కూటమిలో కూడా చేరుకుండా స్వతంత్రంగా ఉండటమే అలీన విధానం. దీన్ని భారత మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచే భారత్ పాటిస్తుంది. సో.. ఇప్పుడు కూడా భారత ప్రభుత్వం ఇదే విధానానికి కట్టుబడి ఉంటే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి