ఏపీలో మరో జాతీయ రహదారి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కల్వకుర్తి జమ్మలమడుగు జాతీయ రహదారి నిర్మాణంలో మరో అడుగు పడింది. కల్వకుర్తి- జమ్మలమడుగు 167K జాతీయ రహదారి నిర్మాణ పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించారు. ఐదో ప్యాకేజీ కింద నల్లకాల్వ – వెలుగోడు రహదారి నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.400 కోట్లు నిధులు కేటాయించింది. నల్లమల అడవిలో 17 కిలోమీటర్ల మేరకు రెండు వరుసలుగా రహదారి నిర్మాణం జరగనుంది.

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తిరుపతికి రోడ్డు మార్గంలో కర్నూలు మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. అయితే కల్వకుర్తి- జమ్మలమడుగు 167K జాతీయ రహదారి నిర్మాణం పూర్తి అయితే.. హైదరాబాద్ నుంచి నంద్యాల మీదుగా తిరుపతికి వెళ్లొచ్చు. దీంతో హైదరాబాద్ తిరుపతి మధ్య ప్రయాణ దూరం కూడా 70 కిలోమీటర్ల వరకూ తగ్గుతుందని అధికారులు చెప్తున్నారు. కల్వకుర్తి – జమ్మలమడుగు జాతీయ రహదారి నిర్మాణాన్ని కేంద్రం వివిధ ప్యాకేజీలుగా విభజించింది.
కల్వకుర్తి నుంచి సోమేశ్వరం వరకు ఒకటో ప్యాకేజీగా, సోమేశ్వరం- సంగమేశ్వరం మధ్యన కేబుల్ బ్రిడ్జి రెండో ప్యాకేజీగా పనులు చేపడుతున్నారు. సోమేశ్వరం – సంగమేశ్వరం కేబుల్ బ్రిడ్జి కింద అప్రోచ్ రోడ్లను మూడో ప్యాకేజీగా నిర్ణయించారు, సంగమేశ్వరం – నల్లకాల్వ, వెలుగోడు – నంద్యాల వరకు నాలుగో ప్యాకేజీగా విభజించారు. నల్లకాల్వ- వెలుగోడు రోడ్డు పనులను 5వ ప్యాకేజీగా నిర్ణయించారు. అయితే ఒకటో ప్యాకేజీ పనులు ఏడాది కిందటే పూర్తి అయ్యాయి. 2, 3, 4వ ప్యాకేజీ పనులకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తైంది. ఐదో ప్యాకేజీ అయిన నల్లకాల్వ – వెలుగోడు పనులు ఇన్నిరోజులు ముందుకు సాగలేదు.
నల్లకాల్వ – వెలుగోడు రహదారి నిర్మాణం నల్లమల పులుల అభయారణ్యం పరిధిలో ఉంది. దీంతో పలు విభాగాల నుంచి అనుమతులు అవసరం. దీంతో ఈ ప్యాకేజీ పనులలో జాప్యం జరుగుతోంది. అయితే తాజాగా నల్లకాల్వ -వెలుగోడు రహదారి నిర్మాణానికి కేంద్రం నిధులు విడుదల చేయడంతో ఇక పనులు జోరందుకోనున్నాయి.
నల్లకాల్వ- వెలుగోడు మధ్య అడవిలో 17 కిలోమీటర్ల మేర 10 మీటర్ల వెడల్పుతో 2 వరుసలుగా రహదారిని నిర్మించనున్నారు. ఈ మార్గంలో ప్రస్తుతం ఒకే వరుస రహదారి ఉండగా.. దానిని విస్తరించనున్నారు. తాజాగా కల్వకుర్తి – జమ్మలమడుగు ఐదో ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం రూ.400 కోట్ల నిధులు కేటాయించటంతో పనులు శరవేగంగా జరగనున్నాయి.