
గుంటూరులోని గోరీల దొడ్డికి చెందిన రాజు… మిర్చి యార్డులో హమాలీగా పనిచేస్తుంటాడు. పదిహేనేళ్ల క్రితం రఘురామ్ నగర్కు చెందిన లక్ష్మిని ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకుంటానని పంతం పట్టాడు. అయితే ఆమెకు అప్పటికే వివాహం అయింది. మొదటి భర్తతో విబేధాల నేపధ్యంలో విడాకులు తీసుకుంది. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. అయినా లక్ష్మిని వివాహం చేసుకునేందుకు రాజు ముందుకొచ్చాడు. వీరిద్దరి పరిచయం కూడా హైదరాబాద్లో ఒక ప్రవేటు కంపెనీలో పనిచేస్తుండగా మొదలైంది. రాజును నమ్మిన లక్ష్మి అతన్ని వివాహం చేసుకుంది. అప్పటి నుంచి ఇద్దరూ గుంటూరులోనే ఉంటున్నారు. లక్ష్మి కొడుకు టెక్నీషియన్గా పనిచేస్తుండగా.. కుమార్తె అకౌంటెంట్గా పనిచేస్తుంది. అయితే కొన్నేళ్లుగా రాజు…. లక్ష్మీ మధ్య విబేధాలు మొదలయ్యాయి.. లక్ష్మీ ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న రాజు ఆమెను తరుచూ కొడుతుండేవాడు. పిల్లలిద్దరూ పని చేస్తుండటంతో రాజు పని మానేశాడు. లక్ష్మిని పనిలోకి వెళ్లకుండా కట్టడి చేశాడు. అయినప్పటికీ అనుమానం తీర లేదు.
శనివారం పిల్లలిద్దరూ పనిలోకి వెళ్లిన తర్వాత లక్ష్మీతో రాజు ఘర్షణ పడ్డాడు. కోపంతో ఆమెపై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. ఆ తర్వాత రాజు కూడా గొంతు కోసుకున్నాడు. అయితే కొద్దిసేపటి తర్వాత కుమార్తె లక్ష్మికి ఫోన్ చేయగా మూలుగులు వినిపించాయి. దీంతో వెంటనే ఆమె తన అన్నకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. పిల్లలిద్దరూ ఇంటికి వచ్చే సరికి తల్లిదండ్రులిద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు.లక్ష్మి అప్పటికే చనిపోగా, రాజు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే రాజును ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజు జిజిహెచ్ లో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..