మనుషుల్లో మానవత్వం అనేది రోజు రోజుకి మంటగలుస్తోంది. అభం, శుభం తెలియని చిన్నారులను ముళ్ళకంపల్లో, అడవుల్లో వదిలేసి వెళుతున్నారు. కొంతమంది చిన్నారుల ప్రాణాలు అంటే వారికి లెక్కనే లేదు. చిన్నారులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొంతమంది తల్లిదండ్రులు ఇలా చేయడం, అందరిని కలిచివేస్తుంది. తాజాగా మెదక్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే నర్సాపూర్ మండలం కొండాపూర్ అటవీ ప్రాంతంలో నాలుగు నెలల పసి బాలుడిని వదిలి వెళ్ళారు గుర్తు తెలియని వ్యక్తులు. హైదరాబాద్-మెదక్ జాతీయ రహదారి వెంబడి ఉన్న కొండాపూర్ అటవీ ప్రాంతంలో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అటుగా వెళుతున్న వాహనదారులు కారు ఆపి మూత్ర విసర్జన చేయడానికి దిగారు. ఇంతలో చెట్ల పొదల్లో నుంచి పసిపిల్లాడి ఏడుపు శబ్దం వినిపించింది. షాక్కు గురైన వాహనదారులు తొంగిచూడగా, ముక్కుపచ్చలు ఆరని పసి బాలుడు కనిపించాడు.
దీంతో వాహనదారులు వెంటనే 100 డయల్ కి కాల్ చేయగా, నర్సాపూర్ ఎస్సై లింగం తన సిబ్బందితో కలిసి అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. చెట్ల పొదల్లో నాలుగు నెలల పసి బాలుడు ఉన్నట్లు గుర్తించారు. బాలుడికి ప్రథమ చికిత్స చేసి, నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల అనంతరం బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడటంతో శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు పోలీసులు.
కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బాలుడిని ఎవరు పడేశారో దర్యాప్తు చేస్తున్నారు. ఇలా చేయొద్దని ఎంతమంది నెత్తినూరు మొత్తుకున్నా.. కొంతమంది బుద్ధి మాత్రం మారడం లేదు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..