వివాహేతర సంబంధంలో ప్రియుడే కాలయముడయ్యాడు. ఇంకొకరితో సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానంతో అమానుషానికి పాల్పడ్డాడు. తనకు దక్కనిది.. ఇంకెవ్వరికీ దక్కకూడదని ఘాతుకానికి పాల్పడ్డాడు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేటీ దొడ్డి మండలం పీఎస్ పరిధిలో వివాహిత అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో ఈ ఘోరం వెలుగు చూసింది.
జోగుళాంబ గద్వాల్ జిల్లా కేటీ దొడ్డి మండలం పాతపాలెంకు చెందిన సగరం అనితకు కోతులగిద్ద గ్రామానికి చెందిన ఆంజనేయులతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లల సంతానం. అయితే అనిత భర్తకు స్వగ్రామంలో పలువురితో తగాదాలు ఉండడంతో అత్తగారి గ్రామంలోనే కాపురం పెట్టారు. ఆర్థిక పరిస్థితి బాగులేనందున ఆంజనేయులు హైదరాబాద్లో కూలీ పనులు చేస్తున్నాడు. నెలకు రెండు, మూడు సార్లు పాతపాలెం భార్య, పిల్లల వద్దకు వచ్చి వెళ్లేవాడు. ఉన్నంతలో చేసుకుని జీవనం సాగిస్తున్న సంసారంలో పాత ప్రేమ, వివాహేతర సంబంధం చిచ్చు రేపింది.
పాతపాలెం గ్రామానికి చెందిన దలాయి రంగస్వామి, అనిత ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. వీరి పరిచయం పెద్దయ్యాక ప్రేమకు అటు నుంచి శారీరక సంబంధానికి దారితీసింది. అయితే అనితనే పెళ్లి చేసుకోవాలని రంగస్వామి ముందుగా భావించాడు. కులాలు వేరు కావడంతో ఇంట్లో ఒప్పుకోరని అనిత నిరాకరించింది. దీంతో ఇరువురు వేరువేరుగా పెళ్లిళ్లు చేసుకుని ఎవరి జీవనం వారు సాగిస్తున్నారు. ఈ క్రమంలో అనిత తిరిగి పాతపాలెంలోనే కాపురం పెట్టడం, భర్త ఇంటి వద్ద లేకపోవడంతో, వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఇక అనిత ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనందున వారి కుటుంబానికి రంగస్వామి చేదోడు వాదోడుగా ఉన్నాడు. రంగస్వామికి మద్యం సేవించే ఆలవాటు ఉండడంతో గత కొన్ని రోజులుగా విపరీతంగా మద్యం సేవించి అనిత నివాసానికి వచ్చిపోయేవాడు. దీంతో మద్యం సేవించిన రంగస్వామిని అనిత దగ్గరికి రానివ్వకుండా దూరం పెడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే జూన్ 15వ తేదీన రాత్రి రంగస్వామి ఇంటి వద్ద మద్యం మత్తులో భార్య, తల్లితో గొడవపడ్డాడు. అనంతరం రాత్రి 11.30లకు అనిత ఇంటికి వెళ్లాడు. అక్కడ అనితతో సైతం రంగస్వామి గొడవకు దిగాడు. తనను ఎందుకు దూరం పెడుతున్నావని వాగ్వివాదానికి దిగాడు.
దీంతో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి రంగస్వామి అనితను చెంపపై కొట్టాడు. ప్రతిగా అనిత సైతం రంగస్వామిని చెంపపై కొట్టింది. ఇద్దరు కాసేపు దూరంగా కూర్చున్నారు. ఇక జరిగిన గొడవతో అనితపై అనుమానంతో రంగస్వామి.. తనకు దక్కనిది ఇంకెవరికి దక్కకూడదని ఆగ్రహించి అనిత చీర కొంగును ఆమె మెడకు గట్టిగా బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు రంగస్వామి. ఇక, అనితను హత్య చేసిన రంగస్వామి అర్ధరాత్రి తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయం అనిత ఇంటికి వెళ్లిన ఆమె సోదరుడు అశోక్ విషయాన్ని గమనించి కేటీ దొడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అనిత కాల్ డేటా పరిశీలించగా, చివరిసారిగా రంగస్వామితో మాట్లాడినట్లు గుర్తించారు. రంగస్వామిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా హత్య నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడి ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఇక అనిత హత్యోదంతంతో పాతపాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివాహేతర బంధం కారణంగా ఇద్దరు పిల్లలు తల్లిలేనివారుగా మారిపోయారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..