ప్రభుత్వ పాఠశాల ఎదుట అడ్మిషన్స్ క్లోజ్ బోర్డు ఉంటుందని ఎప్పుడైనా అనుకున్నారా.. కానీ ఏపీలోని ఓ పాఠశాలకు మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. తమ పిల్లలకు అడ్మిషన్ ఇవ్వాలంటూ భారీగా వస్తున్నారు. దీంతో స్కూలు యాజమాన్యం గేటు ముందు అడ్మిషన్స్ క్లోజ్ అంటూ బోర్డు పెట్టేసింది. ఈ స్కూలు ఎక్కడుందని అనుకుంటున్నారా.. నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ వద్ద పరిస్థితి ఇది. దీనిపై నారా లోకేష్ కూడా స్పందించారు. ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమంటూ ట్వీట్ చేశారు.

*సీనియర్ అమ్మాయితో ప్రేమ.. పెళ్లి చేసుకుని 2 నెలలు హ్యాపీ.. ఆ తర్వాతే, తలకిందులైన యువకుడి జీవితం..
సర్కారీ బడులంటే పెచ్చులూడిన గదులు, విరిగిపోయిన బల్లలు, నలుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు అనే అపోహ చాలామందిలో ఉంది. కానీ నెల్లూరు జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలను చూస్తే మాత్రం మీరు, మీ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పదు. ఆ స్కూల్లో అడ్మిషన్ కోసం జనాలు క్యూ కడుతున్నారు. చివరకు పాఠశాల యాజమాన్యం అడ్మిషన్స్ క్లోజ్ అనే బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది. అదే నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ . వీఆర్ హైస్కూల్లో తమ పిల్లలకు అడ్మిషన్లు కావాలంటూ తల్లిదండ్రులు తాపత్రయపడుతుండగా.. సీట్లు ఫుల్ కావటంతో ఇలా అడ్మిషన్స్ క్లోజ్డ్ అంటూ బోర్డు పెట్టారు.
నెల్లూరు వీఆర్ హైస్కూల్.. గతంలో మూతపడింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో వీఆర్ హైస్కూలుకు మంచి రోజులు వచ్చాయి. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వీఆర్ హైస్కూలు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ స్కూలును తిరిగి ప్రారంభమయ్యేలా చూశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధులతో వీఆర్ హైస్కూల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించారు. రూ.15 కోట్లతో వీఆర్ హైస్కూల్ రూపురేఖలే మార్చివేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పాఠశాలలో తమ పిల్లలను చేర్చేందుకు పోటీపడ్డారు. ఈ ఏడాది వీఆర్ హైస్కూల్లో వేయి మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు.
*ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి.. రూ.400 కోట్లు కేటాయించిన కేంద్రం.. తిరుపతికి ఇక దూసుకెళ్లొచ్చు..
ఆ ప్రభుత్వ పాఠశాలకు ఫుల్లు డిమాండ్.. అడ్మిషన్స్ క్లోజ్ అంటూ బోర్డే పెట్టేశారు..
జూన్ 23 నుంచి వీఆర్ మున్సిపల్ హైస్కూల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకూ మూడు సెక్షన్లు చొప్పున విద్యార్థులను విభజించారు. మరోవైపు వీఆర్ మున్సిపల్ హైస్కూల్లోనే మంత్రి నారాయణ చదువుకోవటం విశేషం. తనకు విద్యాబుద్ధులు నేర్పించిన పాఠశాలను అభివృద్ధి చేయాలని ఆయన భావించారు. ఈ క్రమంలోనే మంత్రి నారాయణ కుమార్తెలు.. పాఠశాల ఆధునికీకరణలో భాగం పంచుకున్నారు.
ఈ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం అందించే యూనిఫామ్తో పాటుగా నారాయణ విద్యాసంస్థలు మరో 4 జతల యూనిఫామ్స్ అందించనున్నాయి. అలాగే వీఆర్ హైస్కూలుకు దగ్గరగా ఉన్న విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు, దూర ప్రాంతంలో ఉండే విద్యార్థులకు ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు.
మరోవైపు వీఆర్ హైస్కూల్ వద్ద అడ్మిషన్స్ క్లోజ్ అనే బోర్డు పెట్టడంపై ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. పాఠశాలను అభివృద్ధి చేసినందుకు మంత్రి నారాయణను లోకేష్ అభినందించారు. వైసీపీ ప్రభుత్వం నిర్వహించలేక మూసివేసిన వీఆర్ హైస్కూల్లో.. ప్రస్తుతం అడ్మిషన్స్ ముగిశాయని బోర్డు పెట్టారంటే.. అదే మార్పునకు నిదర్శనమంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.