ఓ ఫిషింగ్ బోటు యజమాని పంట పండింది. చేపల వేటకు వెళ్లిన అతడి వలకు.. ఒక భారీ చేప చిక్కింది. దాన్ని వేలం వేయగా ఏకంగా 67 వేల పౌండ్లు పలికింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 77 లక్షలు. వివరాల్లోకి వెళ్తే.. ఈశాన్య తీరంలోని తైవాన్లో లిన్ అనే బోట్ డ్రైవర్.. తన పడవతో సముద్రంలోకి ఫిషింగ్కు వెళ్లాడు. ఇక అతడి వలకు 216 కిలోల బరువున్న ట్యూనా చేప చిక్కింది. దాన్ని కోస్టల్ ఏరియాకు తీసుకొచ్చి.. వేలం వేయగా.. 67 వేల పౌండ్లు పలికింది. రెండు నెలల క్రితమే చేపల వేట ప్రారభించిన లిన్కు.. ఇంత సులువుగా పెద్ద చేప చిక్కడంతో ఆశ్చర్యపోయాడు. స్థానిక మత్స్యకారుల ప్రకారం.. ఆ ట్యూనా చేప కిలోకు 1,607 పౌండ్లకు అమ్ముడవుతుందట.
అసలు ఈ అరుదైన ట్యూనా చేపలు ఎందుకింత ధర పలుకుతాయో తెల్సా..! ఈ చేపలు నలుపు రంగులో నిగనిగలాడుతుంటాయి. వీటిని బ్లాక్ డైమండ్ అని కూడా అంటారు. ఆంధ్రాలో ఎలాగైతే పుస్తెలు అమ్మైనా పులస తినాలని అంటుంటారో.. జపాన్లో కూడా అంతే.! అప్పు చేసైనా బ్లూఫిన్ ట్యూనా చేపలు తినాలని అక్కడి ప్రజలు అనుకుంటారు. ఎక్కడో దూరదూరాల నుంచి ప్రజలు వీటిని తినడానికి ఇష్టపడతారు.
ఈ చేపలో ప్రొటీన్, ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, ఖనిజాలతో పాటు అరుదైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట. గుండె, మెదడు, కణజాలం, చర్మ ఆరోగ్యానికి చాలా మంచివట ఈ చేపలు. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేపలు అని వీటిని అంటారు.