రైలులో దొంగతనం చేసిన కరుడుగట్టిన గజదొంగను 48 గంటల్లో అరెస్ట్ చేశారు. ఇండోర్-దౌండ్ ఎక్స్ప్రెస్ రైలు నెంబర్ 22944లో 35.45 లక్షల రూపాయల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు, నగదుతో కూడిన హై ప్రొఫైల్ దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్థానిక క్రైమ్ బ్రాంచ్ లు సమన్వయంతో వ్యవహరించి కేవలం 48 గంటల్లోనే దొంగను పట్టుకున్నారు.
జూన్ 20న రాత్రి రైలులోని కోచ్ A-2లో దొంగతనం జరిగింది, ఇండోర్ నుంచి తన భర్తతో కలిసి లోనావాలాకు ప్రయాణిస్తున్న 73 ఏళ్ల మహిళ ఉదయం 7:30 గంటల ప్రాంతంలో మేల్కొని చూసేసరికి తన హ్యాండ్బ్యాగ్ కనిపించలేదు. బ్యాగ్లో డైమండ్ నెక్లెస్, బ్రాస్లెట్, బంగారు గొలుసు, ఉంగరాలు, గడియారంతో పాటు 50 వేల రూపాయల నగదు నగదు ఉన్నాయి. ఆమె నిద్రపోతున్నప్పుడు బ్యాగ్ను తన దగ్గర ఉంచుకుంది. తెల్లారేసరికి బ్యాగ్ మాయం అయింది. దీంతో వెంటనే ఆమె వెంటనే రైల్వే హెల్ప్లైన్ 139కి డయల్ చేసింది. GRP లోనావాలాలో FIR నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రైలు ప్రయాణించిన మార్గంలోని ఇండోర్, ఉజ్జయిని, రత్లం, సూరత్, వాసాయి రోడ్, కళ్యాణ్ స్టేషన్లతో పాటు ఇతర స్టేషన్లలో పోలీసులను అలర్ట్ చేశారు. సిసిటివి ఫుటేజ్లను పరిశీలించారు. కళ్యాణ్ వద్ద దిగుతున్న ఒక అనుమానితుడిని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది నిందితుడు ముంబైలోని చెంబూర్ నివాసి మహేష్ అరుణ్ ఘాగ్ అలియాస్ విక్కీగా గుర్తించారు. 15 రోజుల క్రితం ఇలాంటి కేసులో బెయిల్పై బయటకు వచ్చినట్లు తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని మొత్తం సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాధితుడి కుటుంబానికి అప్పగించారు. 48 గంటల్లోనే దొంగతనాన్ని ఛేదించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.
అయితే రేళ్లలో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే ఆన్-బోర్డ్ సిబ్బందికి లేదా హెల్ప్లైన్ నెంబర్ 139కి కంప్లైంట్ చేయాలని రైల్వే అధికారులు సూచించారు.