ఏపీలోని ధర్మవరానికి చెందిన సయ్యద్ ఫరూక్ అనంతపురం జిల్లా పుట్టపర్తికి చెందిన ఓ ప్రైవేట్ ఏజెంట్ ద్వారా డ్రైవర్ ఉద్యోగం కోసం కొన్నేళ్ల క్రితం సౌదీకి వెళ్లాడు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత తనకు చెప్పిన ఉద్యోగం కాకుండా ఫరూక్తో ఇతర వేరే పనులు చేయించారు. వెట్టి చాకిరీ చేయించడంతో తీవ్ర మానసిక, శారీరక వేదనకు గురిచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ బాబుకు ఫరూక్ వీడియో కాల్ చేసి తన బాధను వెలిబుచ్చుకున్నాడు. దీనిపై వెంటనే స్పందించిన హరీష్ బాబు, ఈ విషయాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విషయం పై మానవతా ధృక్పథంతో స్పందించిన మంత్రి సత్యకుమార్ తక్షణమే కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్కు లేఖ రాశారు. ఆ లేఖలో మూడు ప్రధాన అంశాలను ప్రస్తావించారు. ఒక్కటి ఫరూక్కు ప్రాణ రక్షణ కల్పించాలి, రెండు అతని పాస్పోర్టును తిరిగి అందజేయాలని, మూడు భారత రాయబార కార్యాలయం ద్వారా స్వదేశానికి వచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఈ చర్యల ఫలితంగా ఫరూక్ జూన్ 22న సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చాడు. జూన్ 23న ధర్మవరంలోని మంత్రి సత్యకుమార్ కార్యాలయానికి వచ్చి కార్యాలయ సిబ్బందిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్బంగా బాధితుడు ఫరూక్ మాట్లాడుతూ.. మంత్రి సత్యకుమార్ సహకారం లేకపోతే తాను స్వదేశానికి తిరిగి వచ్చేవాడినే కాదని, తనను రక్షించి కుటుంబ సభ్యులదరికి చేర్చిన మంత్రి తనకు దేవుడితో సమానం అన్నారు. ఈ చొరవ బీజేపీ నాయకులు సామాన్యుల పట్ల ఎంత బాధ్యతాయుతంగా ఉంటారో చాటిచెబుతుందన్నారు. విదేశాల్లో చిక్కుకుపోయిన తన పట్ల తక్షణం స్పందించిన మంత్రి దృష్టికి తీసుకెళ్లడంలో నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు తీసుకున్న చొరవ, వెంటనే కేంద్రానికి లేఖ రాసి మంత్రి గారు స్పందించిన తీరు, ప్రభుత్వ స్థాయిలో జరిగిన సమన్వయం ప్రశంసనీయమని ఫరూక్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారతీయుల భద్రత కోసం బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ నిలబడి ఉంటుందన్నదానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యమని ఫరూక్ తెలిపారు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..