ఏడాది క్రితం జరిగిన ఒక యువకుడి అనుమానాస్పద మృతి మిస్టరీని పోలీసులు చివరకు ఛేదించారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరిగిన ఒక మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు బయటపెట్టారు పోలీసులు. ఈ కేసు జైపూర్లోని షిప్రా పాత్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 2024 జూలై 11న ప్రియాంషు మీనా అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కుటుంబ సభ్యులు మొదటి నుంచి తమ కుమారిడి సాధారణం మరణం కాదని, కుట్రపూరిత హత్య అని అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేయడంతో ఈ మరణం వెనుక ఉన్న భయంకరమైన మాదకద్రవ్యాల వ్యాపారుల హస్తం బయటపడింది.
పోలీసుల దర్యాప్తు ప్రకారం, మృతుడు ప్రియాంషును హత్య కేసులో అతని స్నేహితుడు అభిషేక్ అలియాస్ భోలా ప్రధాన నిందితుడిగా నిర్ధారించారు. అభిషేక్ ప్రియాంషును మాదకద్రవ్యాలకు బానిసను చేశాడని గుర్తించారు. సంఘటన జరిగిన రోజున భోలా ప్రియాంషుకు చెందిన దాదాపు లక్ష రూపాయల విలువైన ఐఫోన్ను కేవలం రూ.5000 కు తాకట్టు పెట్టాడు. ఈ డబ్బుతో, అతను ‘ఈవిల్’ అనే ప్రమాదకరమైన ఇంజెక్షన్ను కొనుగోలు చేశాడు. కల్పనా సాన్సి అనే మహిళ నుండి స్మాక్ను కూడా కొనుగోలు చేశాడు. ఆ తరువాత ప్రియాంషును ఒక మురికి కాలువ దగ్గరకు పిలిచి, అక్కడ బలవంతంగా ఇంజెక్ట్ చేయించారు. ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే ప్రియాంషు అక్కడికక్కడే మరణించాడని పోలీసులు వివరాలు వెల్లడించారు.
ఈ కేసులో రెండవ ప్రధాన నిందితురాలిగా ఉన్న కల్పనా సాన్సి చాలా కాలంగా జైపూర్ యువకులకు మత్తు పదార్థాలను అమ్ముతోంది. ఆమె ఇప్పటికే పోలీసుల నిఘాలో ఉంది. అభిషేక్ డ్రగ్స్ కొనడానికి ఆమెను సంప్రదించినప్పుడు ఆమె పేరు ఈ కేసులో బయటపడింది.
ఇవి కూడా చదవండి
ప్రియాంషు తండ్రి గజేంద్ర మీనా తన కొడుకు మృతిపై మొదటి నుండి అనుమానం వ్యక్తం చేశాడు. తన కొడుకుని హత్య చేశారంటూ అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏడాది పాటు కొనసాగిన ఈ కేసులో డీసీపీ సౌత్ దిగంత్ ఆనంద్, ఠాణా ఎస్హెచ్ఓ రాజేంద్ర గొదారా బృందం అవిశ్రాంత కృషితో మొత్తం కేసును బయటపెట్టింది. ఈ సంఘటన ఒక యువకుడి మరణానికి దారితీయడమే కాకుండా, మొత్తం యువ తరాన్ని మాదకద్రవ్యాల ఊబిలోకి ఎలా నెట్టేస్తుందో తెలిసేలా చేస్తుంది. నేడు, ఖరీదైన గాడ్జెట్లు యువత ప్రాధాన్యతగా ఉండగా, మాదకద్రవ్యాల వ్యాపారులు దీనిని ఒక మార్గంగా ఉపయోగిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..