ఏప్రిల్ 22వ తేదిన హత్యకు గురైన టిడీపీ నేత వీరయ్య చౌదరి హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ప్రకాశంజిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకు చెందిన ముప్పవరపు వీరయ్య చౌదరి ఒంగోలులో తన కార్యాలయంలో ఉండగా ఆయన ప్రత్యర్ధులు కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేయించారు. బాపట్ల పార్లమెంట్ టిడీపీ ఇన్చార్జిగా ఉన్న ముప్పవరపు వీరయ్య చౌదరిని దుండగులు కత్తులతో పాశవికంగా పొడిచి పొడిచి చంపారు. కేవలం మూడు నిమిషాల వ్యవధిలో 53 సార్లు కర్కశంగా కత్తులతో పొడిచారు. దీంతో వీరయ్య చౌదరి అక్కడిక్కడే చనిపోయారు. కత్తిపోట్ల ధాటికి గుండె మూడు ముక్కలైందని పోస్టుమార్టమ్ చేసిన వైద్యులు తెలిపారు.
ఈ ఏడాది ఏప్రియల్ 22వ తేది రాత్రి 7 గంటల 30 నిమిషాల సమయంలో గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు ఒంగోలు మినీ బైపాస్ లోని టిడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి కార్యాలయంలోపలికి చొరబడ్డారు. తన కార్యాలయంలో కూర్చుని ఉన్న వీరయ్యపై కత్తులతో కిరాతకంగా దాడిచేసి చంపేశారు. ఆ సమయంలో వీరయ్యతో పాటు కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి, ఉద్యోగి బంధువైన మరో మహిళ ఉన్నారు. వీరిద్దరిని కత్తులతో బెదిరించి వాళ్ళ ముందే వీరయ్యను పొడిచి చంపేశారు దుండగులు.
హంతకులు అక్కడి నుంచి పారిపోగానే వీరయ్యను ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు అక్కడున్న ఉద్యోగులు. అయితే వీరయ్య అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్దారించడంతో..మృతదేహాన్ని అక్కడి నుంచి పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జిజిహెచ్కు తరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన జరిగిన ప్రదేశం జిల్లా పోలీస్ కార్యాలయానికి అర కిలోమీటర్ దూరంలో ఉండడం చర్చనీయాంశంగా మారింది. టిడీపీలో కీలక నేతగా ఉన్న వీరయ్య చౌదరి కుటుంబాన్ని సియం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు పరామర్శించారు.
అమ్మనబ్రోలు గ్రామంలో రాజకీయ ఆధిపత్య పోరు కారణంగా వీరయ్య చౌదరిని ప్రత్యర్ధులు హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. ఈ కేసులో మొత్తం 12 మందిని నిందితులుగా పేర్కొన్నారు. మే 14వ తేదిన 9 మందిని అరెస్ట్ చేశామని.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. పరారీలో ఉన్న ముగ్గురిలో ప్రధాన నిందితుడిగా ఉన్న ముప్పా సురేష్ను మాత్రం ఇంతవరకు పోలీసులు దొరలేదు. ప్రస్తుతం జైల్లో రిమాండ్లో ఉన్న 9 మందిలో నలుగురు ముఖ్య నిందితులుగా ఉన్న బోర్లగుంట వినోద్ కుమార్, ఆళ్ల సాంబశివరావు అలియాస్ సిద్ధాంతి, గోళ్ళ రూత్యేంద్ర బాబు, ఓబిలి నాగరాజులను పోలీసులు 4 రోజుల కస్టడీ తీసుకున్నారు.
ఈ నెల 24 వతేది నుంచి 27 వరకు 4 రోజులు పోలీసు కస్టడీలో విచారించనున్నారు. ఒంగోలులోని జిల్లా జైలు నుంచి పోలీసు కస్టడీకి తీసుకునే ముందు జిజిహెచ్లో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విచారణ నిమిత్తం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండా, లాయర్ విజిబుల్ డిస్టెన్స్ లో నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.
మరిన్న ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.