ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మారిషస్ ప్రధాని రామ్గులంతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా, భారతదేశం – మారిషస్ మధ్య ఉన్న ప్రత్యేక, సంప్రదాయ సంబంధాలను నొక్కి చెబుతూ, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి తమ ఉమ్మడి నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. ఈ సంభాషణలో, ఇద్దరు నాయకులు ఇతర రంగాలలో ద్వైపాక్షిక భాగస్వామ్యం, సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి తీసుకునే చర్యల గురించి కూడా చర్చించారు. అదే సమయంలో, 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మారిషస్ ప్రధానమంత్రి రామ్గులం హృదయపూర్వకంగా పాల్గొన్నందుకు ప్రధానమంత్రి మోదీ ప్రశంసలు కురిపించారు.
మారిషస్ ప్రధానితో ప్రధాని మోదీ పలు విషయాల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. “ఓషన్ విజన్” – “నైబర్హుడ్ ఫస్ట్” పాలసీ పరంగా మారిషస్ అభివృద్ధి ప్రాధాన్యతలకు భారతదేశం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.
భారతదేశానికి ఆహ్వానం..
అభివృద్ధి భాగస్వామ్యం, సామర్థ్య నిర్మాణం, రక్షణ, సముద్ర భద్రత, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి అనేక రంగాలలో కొనసాగుతున్న సహకారం గురించి ఇద్దరు నాయకులు చర్చించారు. చర్చల సందర్భంగా, ప్రధానమంత్రి రామ్గులంను త్వరలో భారతదేశాన్ని సందర్శించాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు. వీలైనంత త్వరగా పర్యటనను ప్లాన్ చేయాలనే కోరికను వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక అభివృద్ధి భాగస్వామ్యాన్ని, ఇతర రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సంప్రదింపులు జరపడానికి ఇద్దరు నాయకులు కూడా అంగీకరించారు.
భారతదేశం-మారిషస్ సంబంధాలు
భారతదేశం – మారిషస్ మధ్య దీర్ఘకాల చారిత్రక, సాంస్కృతిక, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో మారిషస్ భారతదేశానికి ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి. భారతదేశ విజన్ ఓషన్ పాలసీ హిందూ మహాసముద్రంలో సహకారం.. స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది. అయితే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ భారతదేశం చుట్టూ ఉన్న దేశాలతో బహుపాక్షిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..