
తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని అనేక సార్లు ప్రకటించిన రేవంత్ సర్కార్.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. దానిలో భాగంగానే.. విద్యాశాఖపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్రెడ్డి. ఈ సందర్భంగా.. తెలంగాణలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు సార్లు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 48 వేల మంది చేరారని అధికారులు సీఎం రేవంత్కు వివరించారు. అయితే.. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన గదులు నిర్మించాలని ఆదేశించారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు పాఠశాలల్లో తగిన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు.
గ్యాస్, కట్టెల పొయ్యిల బాధల నుంచి మిడ్ మీల్స్ తయారీ మహిళలకు విముక్తి కల్పించాలన్నారు. అందుకు అనుగుణంగా.. సోలార్ కిచెన్లు ఏర్పాటుపై తక్షణమే దృష్టి సారించాలని స్పష్టం చేశారు. మరోవైపు.. ఇంటర్మీడియట్ విద్యపైనా అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆరా తీశారు. ఈ క్రమంలోనే.. పదో తరగతిలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల సంఖ్యకు, ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతున్న విద్యార్థుల సంఖ్యకు మధ్య భారీ తేడా ఉండడంపై ప్రశ్నించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులంతా కచ్చితంగా ఇంటర్లో చేరేలా చూడాలన్నారు. ఇంటర్ తర్వాత జీవనోపాధికి అవసరమైన స్కిల్డ్ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చని.. దానిద్వారా వారి జీవితానికి ఢోకా ఉండదని సీఎం రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు.