హైదరాబాద్, జూన్ 26: తెలంగాణ పాలిసెట్ 2025 తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్దులు ఆన్లైన్ విధానంలో జూన్ 28వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలనకు కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి విండో ఓపెన్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 59 ప్రభుత్వ, 57 ప్రైవేట్ కాలేజీల్లో మొత్తం 29,263 డిప్లొమా సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే పాలిటెక్నిక్లో 100 శాతం సీట్లను కన్వీనర్ కోటా కిందే భర్తీ చేయనున్నారు. ఇందులో అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలో 6,703 సీట్లు, ఈఈఈలో 5,850 సీట్లు, ఈసీఈలో 5,783 సీట్లు, మెకానికల్లో 4,008 సీట్లు, సివిల్లో 3,929 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
కాగా తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ 2025 ప్రక్రియ మొత్తం 2 విడతల్లో జరగనున్న సంగతి తెలిసిందే. తొలి విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమవగా.. తుది విడత జూలై 9 నుంచి ప్రారంభమవుతుంది. తొలి విడత ధ్రువపత్రాల పరిశీలన జూన్ 26 నుంచి జూన్ 29 వరకు ఉంటుంది. ఇక జూలై 1వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అనంతరం జులై 4వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. అదే రోజు నుంచి అంటే జూలై 4 నుంచి సీట్లు పొందిన విద్యార్ధులు జూలై 6వ తేదీ వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవల్సి ఉంటుంది. ఒక వేళ ఎవరైనా విద్యార్ధి సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు.
ఇక ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ జూలై 9 నుంచి ప్రారంభమవుతుంది. జూలై 11వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన, జూలై 11వ తేదీ నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. జూలై 15వ తేదీన అభ్యర్థులకు తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. జూలై 18వ తేదీ నుంచి 2025-26 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్ కోర్సుల మొదటి ఏడాది తరగతులు ప్రారంభమవుతాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.