
గురువారం ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో సీఎం సీటుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని..ఆయన సీఎం పదవి నుంచి దిగిపోయాక, అంతే రాబోయే తొమ్మిదేళ్ల తర్వాత సీఎం అయ్యేందుకు తాను ప్రయత్నిస్తున్నానని జగ్గారెడ్డి అన్నారు. రాబోయే ఐదేళ్ల కోసం సీఎం రేవంత్ ఇప్పటికే ప్రజల ముందు అప్పీల్ పెట్టుకున్నారని.. మరో 9ఏళ్ల తర్వాత సీఎం అయ్యేందుకు తాను కూడా ప్రజల ముందు అప్పీల్ పెడుతున్నానని తెలిపారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అద్భుతంగా సాగుతుందని ఆయన అన్నారు. గతంలో రైతు బంధు వేసేందుకు బీఆర్ఎస్ ఐదు నెలల టైం తీసుకునేదని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమచేసిందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ హయంలో డబ్బులు అందుబాటులో ఉండి కూడా వేయలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు కడుతూ కూడా రైతు భరోసా వేసిందన్నారు.
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా ఫోన్ ట్యాపింగ్తోనే నడిచిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు అంతా ఏం చేస్తున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిఘా పెట్టిందని. తన ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు పోలీసులు తనకు చెప్పినట్టు తెలిపారు. కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడంపైన దృష్టి పెట్టిన బీఆర్ఎస్ గత పదేళ్ల రాష్ట్ర పాలనను గాలికొదిలేసిందని విమర్శించారు.
మరోవైపు కేసీఆర్ కుటుంబంపై కూడా జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ ఇల్లు డ్రామా కంపెనీ అయ్యిందని.. కవిత వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే హోదా, స్థాయి కవితకు లేవు అన్నారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఒకే స్థాయి వారని.. వారిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటే ఆర్థం ఉంది.. మరీ మధ్యలో కవిత దూరడం ఏంటీ.. అంత అవసరం ఏముందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ కూతురు మినహా ఆమెకు ఉన్న అర్హత ఏంటని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..