గంజాయి, డ్రగ్స్ను రాష్ట్రం నుంచి పూర్తిగా నిర్మూలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గంజాయి సాగును అరికట్టేందుకు శాటిలైట్, డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తామని, ముఠా గొడవలకు తావులేకుండా రాయలసీమలో ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ విషయంలో ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. గంజాయి పెంచేవారని వదిలిపెట్టబోనని వెల్లడించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో నార్కోటిక్స్ సెల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

సాటిలైట్, డ్రోన్లతో నిఘా
“ఇప్పుడే హామీ ఇస్తున్నాం, ఈరోజు కూడా హెచ్చరిస్తున్నాం. ఒక సంవత్సరం అందరికీ చెప్పా. ఏజెన్సీ ఏరియాలో క్లియర్ గా చెప్పా. ఎక్కడా గంజాయి పెంచడానికి వీలులేదు. సాటిలైట్, గూగుల్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం. డ్రోన్స్ పంపిస్తున్నాం. మీరు ఎక్కడైనా సరే గంజాయి పెంచితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టనని హెచ్చరిస్తున్నా,” అని చంద్రబాబు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
రాయలసీమ ముఠాలపై ఉక్కుపాదం
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ముఠా గొడవలకు తావు ఉండదని సీఎం స్పష్టం చేశారు. రాయలసీమలో ముఠాలను అణచివేసిన చరిత్ర టీడీపీకి ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడతామని, విద్వేషాలు రెచ్చగొట్టేవారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని అన్నారు. గంజాయి ముఠాలకు సహకరించిన వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
సమష్టి బాధ్యత.. ప్రతిపక్షాల సహకారం
గంజాయిని నిర్మూలించడం కేవలం ప్రభుత్వానిదే కాదు, అందరి బాధ్యత అని సీఎం పేర్కొన్నారు. ఈ పోరాటంలో ప్రతిపక్షాలు కూడా సహకరించాలని కోరారు. ప్రజలను మెప్పించి ఓట్లు వేయించుకోవాలని, తప్పుడు పనులతో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే కుదరదని ఆయన అన్నారు. 2021లో దేశంలో మొత్తం గంజాయి సాగులో 50 శాతం ఏపీ, ఒడిశా నుంచే వచ్చిందని, విశాఖ కేంద్రంగా ఈ కార్యకలాపాలు జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్త కార్యక్రమాలు, సంస్కరణలు
గంజాయికి బానిసలై కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారని, అసాంఘిక పనులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ షాపుల్లో కూడా మత్తు పదార్థాలు అమ్ముతున్నారని తెలిపారు. దీనిపై నిఘా కోసం ‘ఈగల్’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక దృష్టి ఉంటుందని చెప్పారు. “ఇప్పటికైనా మారకపోతే రాష్ట్రంలో ఉండేందుకు అర్హత లేదు,” అని ఆయన హెచ్చరించారు.
- రాష్ట్రంలోని 26 జిల్లాల్లో నార్కోటిక్స్ సెల్స్ ఏర్పాటు.
- పాఠశాలల్లో ‘ఈగల్ క్లబ్’ల ఏర్పాటు.
- ఏదైనా సమస్య వస్తే 1972కు మెసేజ్ పంపితే రక్షణ కల్పించే హామీ.
- మద్యం ఆదాయంలో 2 శాతం డ్రగ్స్ నిర్మూలనకు ఖర్చు.
- రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో 56 డీ-అడిక్షన్ కేంద్రాల ఏర్పాటు.
- ఆడబిడ్డల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరిక.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, హోం మంత్రి వంగలపూడి అనిత, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి సినీ నటులు కూడా ముందుకు వచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.