మన దేశంలో ఈ ఏడాది సెప్టెంబర్లో ఆసియా కప్ జరగనుంది. ఈ ఆసియా వరల్డ్ కప్కు ఇంకా మూడు నెలలు మాత్రమే సమయం ఉంది. కానీ, భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా టోర్నీపై సందేహాల మేఘాలు కమ్ముకున్నాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్లో జరగకపోతే, ఆ తర్వాత జరగడం కష్టం, ఎందుకంటే దీని తర్వాత అన్ని జట్ల షెడ్యూల్ ఫిక్స్ అయి ఉంది. ఈ సమయంలో ఇటీవలె ఆసియా కప్ అధికారిక ప్రసార సంస్థ సోనీ ఒక పోస్టర్ను విడుదల చేసింది. టీమిండియా, బంగ్లాదేశ్, శ్రీలంక కెప్టెన్లను మాత్రమే ఆ పోస్టర్లో చూపించారు. పాకిస్తాన్ కెప్టెన్ ఆ పోస్టర్లో లేడు. దీంతో.. ఆసియా కప్లో పాకిస్థాన్ పాల్గొనడంపై గందరగోళం నెలకొంది. పాకిస్థాన్ లేకుండా ఆసియా కప్ నిర్వహిస్తారని అంతా అనుకున్నారు. కానీ, తాజాగా బీసీసీఐ ఆసియా కప్ 2025 గురించి భారత ప్రభుత్వంతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుండి సూచనలు వచ్చిన తర్వాత మాత్రమే.. ఆసియా కప్లో పాక్ ఆడుతుందా లేదా తెలుస్తుంది. అలాగే ఒక వేళ పాక్ పాల్గొంటే.. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడనేడి కూడా BCCI నిర్ణయం తీసుకుంటుంది.
పహల్గామ్ దాడి తర్వాత..
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించి పాకిస్తాన్లోని అనేక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. దీని తర్వాత, రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగింది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, దాని ప్రభావం క్రికెట్పై కనిపిస్తోంది. ఈసారి భారతదేశం ఆసియా కప్ 2025ను నిర్వహించాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఈ టోర్నమెంట్లో ఎక్కడ ఆడుతుంది? టోర్నీలో భారత్, పాక్ మ్యాచ్ ఉంటుందా? లేదా? అనేది భారత ప్రభుత్వం నుండి సూచనలు పొందిన తర్వాతే నిర్ణయం తీసుకోవచ్చు.
“నిజం చెప్పాలంటే, దీని గురించి మాకు ఇంకా తెలియదు. మహిళల క్రికెట్ భిన్నంగా ఉంటుంది ఎందుకంటే భారతదేశం-పాకిస్తాన్ మ్యాచ్లకు పెద్దగా ప్రాధాన్యత లభించదు, కానీ పురుషుల క్రికెట్ను కోట్లాది మంది వీక్షిస్తారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత, భారతదేశం-పాకిస్తాన్ మ్యాచ్పై సందేహాల మేఘాలు అలుముకున్నాయి. ఈ విషయంపై మేము ప్రభుత్వంతో మాట్లాడుతాము” అని ఒక BCCI అధికారి అన్నారు.
ఒకవేళ పాకిస్థాన్ ఈ టోర్నీలో పాల్గొంటే.. పాక్ ఆడే మ్యాచ్లను కొలంబో లేదా దుబాయ్లో నిర్వహించే అవకాశం ఉంది. పాకిస్తాన్ మ్యాచ్లను నిర్వహించే అవకాశంపై BCCI ఇంకా శ్రీలంక క్రికెట్ లేదా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో మాట్లాడలేదు. అక్టోబర్లో భారత్ అక్టోబర్ 5న కొలంబోలో జరిగే ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్లో పాకిస్తాన్తో తలపడనుంది. ఈ టోర్నీని కూడా భారత్ నిర్వహిస్తోంది. పాకిస్తాన్ మ్యాచ్లు మాత్రం శ్రీలంకలో జరుగుతాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి