
మన దేశంలో మహా మహిమాన్వితమైన రహస్యాలను దాచుకున్న ఆలయాలకు కొదవే లేదు. అటువంటి ఆలయాల్లో ఒకటి భవేశ్వర మహాదేవ ఆలయం ఉత్తరప్రదేశ్లోని లక్నో జిల్లా సరిహద్దులో ఉంది. ఈ ఆలయం మోహన్లాల్గంజ్ తహసీల్ ప్రాంతంలోని నిగోహన్లోని సాయి నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం లక్నో, రాయ్బరేలి, ఉన్నావ్ జిల్లాల సరిహద్దుల సంగమం వద్ద ఉంది. ఈ ఆలయానికి ఒక్క యుపీ నుంచి మాత్రమే కాదు మధ్యప్రదేశ్, బీహార్ నలుమూలల నుంచి చాలా మంది భక్తులు దర్శనం కోసం వస్తారు. నిర్మలమైన హృదయంతో భక్తులు కోరుకునే కోరికలు ఖచ్చితంగా ఇక్కడ నెరవేరుతాయని నమ్ముతారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో భక్తులు భారీ సంఖ్యలో శివయ్య దర్శనం కోసం పోటెత్తుతారు. ఇప్పటికే ఈ ఆలయంలో శ్రావణ మాసం కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
ఈ ఆలయానికి సంబంధించిన పురాణ నమ్మకం ప్రకారం.. ద్వాపర యుగంలో పాండవులు తమ వనవాస సమయంలో తల్లి కుంతితో కలిసి ఈ ప్రాంతానికి వచ్చారు. అప్పుడే ఈ ఆలయాన్ని స్థాపించారు. కుంతి శివుడికి పరమ భక్తురాలు. శివుడి పూజించకుండా నీరు కూడా తాగేది కాదని చెబుతారు. సమీపంలో శివాలయం లేకపోవడంతో భీముడు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్టించాడు. కాలక్రమేణా, శివలింగం నది నేల కిందకి చేరుకుంది. అలా కనుమరుగైంది. అయితే వందల సంవత్సరాల క్రితం సుదౌలి రాష్ట్ర రాజు కలలో నదిలో ఉన్న శివలింగం కనిపించింది. దీని తరువాత.. రాజు నది అడుగున ఉన్న శివలింగాన్ని తీసి శివాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం తరువాత భవేశ్వర మహాదేవ ఆలయంగా ప్రసిద్ధి చెందింది.
ఔరంగజేబుకు సంబంధించిన నిజం ఏమిటి?
మొఘల్ పాలకుడు ఔరంగజేబు ఒకసారి ఆలయాన్ని దోచుకోవడానికి వచ్చాడని చెబుతారు. ఈ సమయంలో, అతను ఆలయంలో ఉన్న శివలింగాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించాడు, అప్పుడు అకస్మాత్తుగా లక్షలాది తేనెటీగలు మొఘల్ సైన్యంపై దాడి చేశాయి. తేనెటీగల దాడికి తట్టుకోలేని ఔరంగజేబు తన సైన్యాన్ని తీసుకుని ప్రాణాల కోసం అక్కడ నుంచి పారిపోయాడట. ఈ సంఘటన తర్వాత, ఔరంగజేబు తన తప్పును అంగీకరించి క్షమాపణలు చెప్పాడు.
ఆంగ్ల ప్రభుత్వం కూడా ప్రయత్నాలు
మొఘల కాలం తరువాత బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఈ ఆలయ ప్రాచీనతను తెలుసుకోవడానికి.. ప్రయత్నించింది. ఆలయాన్ని తవ్వడానికి యత్నించింది. అయితే తవ్వకం పనులు ప్రారంభమైన వెంటనే వేలాది తేనెటీగలు శివలింగం చుట్టూ నుంచి బయటకు వచ్చి తవ్వకాలు జరుపుతున్న వ్యక్తులపై దాడి చేశాయి. దీని తరువాత బ్రిటిష్ అధికారులు కూడా ఆలయాన్ని విడిచి పారిపోవాల్సి వచ్చింది.
తరువాత సుదౌలికి చెందిన రాజా రాంపాల్ భార్య గణేష్ సాహిబా ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఈ సంఘటన తర్వాత ఈ ఆలయం భవేశ్వర మహాదేవ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఆలయ ఒడ్డున ఉన్న సాయి నది ఆలయ అందాన్ని మరింత పెంచింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు