Andhra Pradesh Cut Power Charges: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల తగ్గింపునకు కృషి చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విశాఖలో నూతనంగా నిర్మించిన సూపర్ ఈసీబీసీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. విద్యుత్ ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. తండాలు, గూడేలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని, టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. త్వరలో రైతులకు పగటిపూటే 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని మంత్రి వెల్లడించారు.
హైలైట్:
- ఏపీలో విద్యుత్ ఛార్జీలపై మంత్రి గొట్టిపాటి
- ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాము
- విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై కీలక వ్యాఖ్యలు

‘స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాలు దాటిన తరువాత కూడా ఇంత వరకు విద్యుత్ సౌకర్యం లేని.. తండాలు, చెంచు గూడేలకు రూ.120 కోట్లు వ్యయంతో విద్యుత్ అందించాము. అదే విధంగా విద్యుత్ స్తంభాలు, లైన్లు వేయలేని టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లోని నివాసితులకు కూడా సోలర్ ప్యానెల్స్, బ్యాటరీ స్టోరేజ్ పద్ధతులలో నిరంతర విద్యుత్ ను అందిస్తున్నాము. ఇది కూటమి ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం’ అన్నారు.
ఏపీలో విద్యుత్ ఛార్జీల తగ్గింపు.. మంత్రి కీలక వ్యాఖ్యలు
‘విద్యుత్ శాఖకు సంబంధించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా అనేక చర్యలు చేపడుతున్నాము. 24 గంటలూ నాణ్యమైన గ్రీన్ ఎనర్జీని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించే లక్ష్యంతో ముందుకెళ్తున్నాము. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 20 లక్షల సోలార్ విద్యుత్ కనెక్షన్లను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం 10 వేల సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు కృషి చేస్తున్నాము. సోలార్ కనెక్షన్లను వేగవంతం చేసే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు స్థానిక సోలార్ తయారీదారులను ప్రోత్సహిస్తున్నాము. అదే విధంగా పీఎం కుసుమ్ పథకంలో భాగంగా… వచ్చే వ్యవసాయ సీజన్ నాటికి.. రైతులకు పగటి పూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ ను అందిస్తాము. రాష్ట్రంలోని మూడు లక్షల వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ కనెక్షన్లను అనుసంధానించే ప్రక్రియ వేగవంతం చేశాము’ అన్నారు మంత్రి.